దురదృష్టవశాత్తూ నిలిచిన ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు: మంత్రి కేటీఆర్

by Dishanational1 |
దురదృష్టవశాత్తూ నిలిచిన ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు: మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దురదృష్ట వశాత్తూ కొన్ని కారణాలతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను సమస్య శ్యామలం చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వెల్ స్పన్ సంస్థ చందనవెల్లిలో రూ. 500 కోట్లతో ఐటీ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ పెట్టుబడితో రూ. 2000 కోట్ల పెట్టుబడిని పూర్తి చేసిందని, రాబోయే ఐదేళ్లలో రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల పెట్టుబడి పెడతామని కంపెనీ ప్రకటించడం అభినందనీయమన్నారు. రంగారెడ్డి జిల్లా చందనవెల్లి పారిశ్రామిక వాడలో వెల్ స్పన్ అడ్వాన్స్డ్ మెటీరియల్ లిమిటెడ్ యూనిట్ ను బుధవారం మంత్రి సబితాతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం చందనవెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదని, ఇప్పుడు ఇక్కడికి పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చాయని, భవిష్యత్ లో తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా చందనవెల్లి మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కంపెనీతో 1200మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. చందనవెల్లిలో తయారయ్యే ఉత్పత్తులు సిలికాన్ వ్యాలీకే వెళ్తాయని తెలిపారు. ఇప్పడు ఈ ఐటీ కేంద్రం ఏర్పాటుతో మరిన్ని చిన్న మధ్య తరహా కంపెనీలు ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తాయన్న అశాభావం వ్యక్తం చేశారు. 2022లో 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.

వెల్ స్పన్ కంపెనీ చైర్మన్ బాల క్రిష్ణ గొయెంకా మాట్లాడుతూ చందనవెల్లిలో ప్రస్తుతం వెల్ స్పన్ కంపెనీ కొనసాగిస్తున్న తన పెట్టుబడులకు అదనంగా ఈ ఐటీ, ఐటీఈఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఐటీ రంగంలో శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించే బాధ్యతను కంపెనీ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లే యువకులు, చందన్వెల్లిలోనూ పనిచేసే స్థాయిలో తమ ఐటీ సెంటర్ ఉంటుందని వెల్లడించారు. భవిష్యత్తులో చందన్వెల్లి ప్రాంతంలోనూ ఐటీ కార్యకలాపాలు విస్త్రృతం అవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వెల్ స్పన్ కంపెనీ ఇప్పటికే ఐటీ మరియు ఐటీఈఎస్ రంగంలో అహ్మదాబాద్, బొంబాయిలలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వీటికి అదనంగా చందనవెల్లిలో తమ పారిశ్రామిక ప్రాంగణంలో ఐటీసెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

Next Story

Most Viewed