నిమ్స్‌లో కిడ్నీ రాకెట్ కలకలం..!

by Ratna Kumari |

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ వైద్య సంస్థ అయిన నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

నిమ్స్‌లో కిడ్నీ రాకెట్ కలకలం..!
X

దిశ, ఖైరతాబాద్ : హైదరాబాద్ నగరంలోని ప్రముఖ వైద్య సంస్థ అయిన నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. కిడ్నీ ఇప్పిస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిమ్స్‌కు చెందిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. పోలీసుల ప్రాథమిక విచారణలో, కిడ్నీ అవసరమైన బాధితులకు త్వరగా దాతలను ఏర్పాటు చేస్తామని చెప్పి లక్షన్నర రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఈ ఘటనపై నిమ్స్ డైరెక్టర్ స్పందించారు. ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా జరిగిన ఈ వ్యవహారంపై అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని నిమ్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో నిమ్స్ ఆసుపత్రిలో భద్రతా, పర్యవేక్షణ వ్యవస్థలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

Next Story