ఖైరతాబాద్‌ సీటు గెలుచుకుంటాం: కల్వకుంట్ల కవిత

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-24 15:06:57  IST  )

వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతామని.. ఆ తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును గెలుచుకుంటామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ...

ఖైరతాబాద్‌ సీటు గెలుచుకుంటాం: కల్వకుంట్ల కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతామని.. ఆ తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును గెలుచుకుంటామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్‌భవన్ ఎదురుగా గల రైల్వే గేట్ నుంచి జెండా గద్దె వరకు పాదయాత్ర నిర్వహించి బస్తీలోని ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తమ పార్టీ అత్యంత పేదల పక్షాన పోరాడుతుందన్నారు.

తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఎంఎస్ మక్తా వాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, డ్రెయినేజీలు ఇతర అనేక సమస్యలతో ఇక్కడి ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ద్వారానే ఈ ప్రాంత ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. సాంప్రదాయ పార్టీల మాదిరిగా కాకుండా ప్రజల్లో ఉండి వారికోసం పనిచేయాలని టీఆర్ఎస్ నాయకులకు కవిత సూచించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాల సాధన కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో చేపట్టనున్న భూపోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే.. తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలన్న రాష్ట్ర స్థానికత అంశంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయని అన్నారు. తెలంగాణలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఇక్కడ చదివిన వారినే రాష్ట్ర స్థానికులుగా గుర్తించాల్సి ఉన్నదన్నారు. దానికి విరుద్ధంగా ప్రొఫెషనల్ కోర్సులు ఇక్కడ చదివిన వారిని సైతం స్థానికులుగా పరిగణించాలన్న హైకోర్టు తీర్పు తెలంగాణ బిడ్డలను కలచి వేసిందన్నారు. హైకోర్టు తీర్పుపై లీగల్ ఫైట్ చేయబోతున్నట్లు తెలిపారు. స్థానికత, తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా..

ఎంతో టాలెంట్, కష్టపడి పనిచేసే గుణం ఉన్నా సరే మహిళలకు సరైన అవకాశాలు రావడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో వెటా ఇండియా బుధవారం ఏర్పాటు చేసిన మహిళ సాధికారిత సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ ప్రపంచమే మహిళకు వ్యతిరేకంగా ఉన్నదన్నారు. ఇప్పటికీ తెలంగాణలో 15-19 ఏళ్ల వయసులోనే తల్లయిన మహిళల సంఖ్య 7.2 శాతంగా ఉన్నదని చెప్పారు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలోనూ టీనేజ్ మదర్స్ సంఖ్య 2.7 శాతమన్నారు. లక్ష్య సాధన విషయంలో ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మీ మాట మీరే వినవద్దని చెప్పారు. అలాగే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన బీజేపీ నాయకుడు నెమలికొండ వేణుమాధవ్ తన అనుచరులతో కలిసి బుధవారం తెలంగాణ రక్షణ సేనలో చేరారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

Next Story