నేడు జూబ్లీహిల్స్ బై పోల్ ఓట్ల లెక్కింపు..‘కౌంట్’ డౌన్.. స్టార్ట్!

by velandi.Saikiran |

జూబ్లీహిల్స్ ఉపఉన్నికల లెక్కింపు సందర్భంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం 15 ప్లాటూన్ల సిబ్బందితో పాటు 250

నేడు జూబ్లీహిల్స్ బై పోల్ ఓట్ల లెక్కింపు..‘కౌంట్’ డౌన్.. స్టార్ట్!
X

నేడు జూబ్లీహిల్స్ బై పోల్ ఓట్ల లెక్కింపు

- మొత్తం 42 టేబుళ్లు, 10 రౌండ్లు

- ఒక్కోరౌండ్ కు 45 నిమిషాలు

- ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు

- మధ్యాహ్నం 12 వరకు ఫలితంపై క్లారిటీ

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. కౌంటింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం 8గంటలకు యూసుఫ్​గూడలోని కోట్ల విజయభాస్కర్​రెడ్డి ఇండోర్​స్టేడియం డీఆర్సీ సెంటర్​లో పోస్టల్​బ్యాలెట్​తో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 407 పోలింగ్​కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల బరిలో 58మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా 48.49 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. మొత్తం ఏడు డివిజన్లలో 1,94,631 ఓట్లు పోలయ్యాయి. బోరబండ డివిజన్ లో అత్యధికంగా 55.92శాతం, అత్యల్పంగా సోమాజిగూడ డివిజన్ లో 41.99 శాతం ఓట్లు పోలయ్యాయి. లెక్కింపునకు మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. కౌంటింగ్​కు మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్​సైట్​లో నమోదు​చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా కోసం ప్రత్యేకంగా ఎల్​ఈడీ స్క్రీన్​ఏర్పాటు చేయనున్నారు.

144 సెక్షన్​ అమలు

జూబ్లీహిల్స్ ఉపఉన్నికల లెక్కింపు సందర్భంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం 15 ప్లాటూన్ల సిబ్బందితో పాటు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద గుంపులుగా తిరగకుండా 144 సెక్షన్​అమలు చేయనున్నారు. అనుమతి ఉన్నవారు మాత్రమే కౌంటింగ్ సెంటర్ వద్దకు రావాలని, శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు.

ప్రతి రౌండ్ కు 45 నిమిషాలు

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక్కో రౌండ్ కు 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే అధికారులకు గురువారం తుదివిడత శిక్షణ ఇచ్చారు. వారంతా శుక్రవారం ఉదయమే ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తెల్లవారుజామున 5 గంటలకే అభ్యర్థుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్​అధికారి స్ట్రాంగ్​రూమ్ తలుపులు తెరిచి లోపలికి వెళ్లనున్నారు. ఈవీఎంలపై ఉండే సీళ్లు, ఇతరత్రా భద్రతా ఏర్పాట్లను సరిచూసుకుని అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టనున్నారు.

డివిజన్ల వారీగా పోలైన ఓట్లు

డివిజన్ మొత్తం ఓట్లు పోలైనవి శాతం

1.బోరబండ 53,211 29,760 55.92

2.ఎర్రగడ్డ 58,752 29,112 49.55

3. రెహమత్ నగర్ 74,387 40,610 54.59

4.షేక్ పేట్ 71,062 31,182 43.87

5.వెంగళ్ రావునగర్ 53,595 25,195 47

6.సోమాజిగూడ 34,653 14,553 41.99

7.యూసుఫ్ గూడ 55,705 24,219 43.47

Next Story