ఆహార కల్తీ పై ఉక్కుపాదం మోపుతున్న హెచ్ ఫాస్ట్

by Taduka Kalyani |

ఆహార కల్తీపై హైదరాబాద్‌ ఫుడ్‌ అడల్టరేషన్‌ సర్వైలెన్స్ టీమ్‌ ( హెచ్‌-ఫాస్ట్‌) ఉక్కుపాదం మోపుతోంది.

ఆహార కల్తీ పై ఉక్కుపాదం మోపుతున్న హెచ్ ఫాస్ట్
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఆహార కల్తీపై హైదరాబాద్‌ ఫుడ్‌ అడల్టరేషన్‌ సర్వైలెన్స్ టీమ్‌ ( హెచ్‌-ఫాస్ట్‌) ఉక్కుపాదం మోపుతోంది. నగరంలోని పలు ప్రాంతాలలో దాడులు చేస్తున్న అధికారులు 100 రోజుల్లో 185 కేసులు నమోదు చేసి121 టన్నుల కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం చేసుకోవడం చూస్తోంటే భాగ్యనగరంలో కల్తీ మాఫియా ఎలా పెరిగిపోయిందో ఇట్లే అర్థం అవుతోంది. రసాయనాలు, నాణ్యత లేని నిల్వ పదార్థాల వాడకం వల్ల పసిబిడ్డల ఎదుగుదల దెబ్బతింటోంది. యువత, వృద్ధులు క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కల్తీ కారణంగా కుటుంబాలను ఆర్థిక సంక్షోభం అనుభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 310 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. ఈ నేపథ్యంలో కల్తీని అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది సుశిక్షితులైన అధికారులు, సిబ్బందితో నిరంతరం పనిచేస్తున్న హెచ్‌-ఫాస్ట్‌ విభాగం.. క్షేత్రస్థాయిలో కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ టీం ఈ వంద రోజుల్లో రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదు కాగా, గోల్కొండ జోన్‌లో 44, సికింద్రాబాద్ జోన్‌లో 35, చార్మినార్ జోన్‌లో 21, శంషాబాద్ జోన్‌లో 13, జూబ్లీహిల్స్ జోన్‌లో 12, ఖైరతాబాద్ జోన్‌లో 5 కేసులతో కలిపి మొత్తం 185 కేసులు నమోదు చేసింది. అంతేకాకుండా, సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది.

27 వేల కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి స్వాధీనం...

ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలు నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27,024.7 కేజీల నకిలీ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు 3 కేసుల్లో 9,260 కేజీల నిల్వ పచ్చళ్లు, 4 కేసుల్లో 4,030 కేజీల కల్తీ కోవా, 7 కేసుల్లో 3,897 కేజీల నకిలీ టీ పొడి, సుమారు 15 టన్నుల నాణ్యత లేని చికెన్/మాంసం (12 కేసులు), 3,260 కేజీల కల్తీ క్రీమ్, 530 కేజీల కల్తీ నెయ్యి (1 కేసు), సుమారు 2,706 కేజీల నాణ్యత లేని డ్రై ఫ్రూట్స్/ఖర్జూరం (2 కేసులు), 2,500 కేజీల కల్తీ పెరుగు (1 కేసు), 1,514 కేజీల కల్తీ పనీర్ (5 కేసులు), ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో 120 కేజీల నాణ్యత లేని ఫ్రైడ్ చికెన్ (2 కేసులు) స్వాధీనం చేసుకున్నారు. ఐస్ క్రీములు, బిస్కెట్లు, ఆర్ఓ వాటర్ ప్లాంట్లు, జంక్ ఫుడ్స్ వంటి ఇతర విభాగాల్లో 34 కేసులు నమోదయ్యాయి.ఇవే కాకుండా జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్(ఎఫ్ఎస్ఓ)లకు తదుపరి చర్యల నిమిత్తం 247 కేసులు అప్పగించారు. ఇందులో అత్యధికంగా పనీర్ అవుట్‌లెట్లపై 70 కేసులు, ప్రజల నుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదులపై 90 కేసులు నమోదు చేశారు. అలాగే సమోసా తయారీ కేంద్రాలపై 11, వాటర్ ప్యాకింగ్ ప్లాంట్లపై 9, మసాలాలు/స్పైసెస్ పై 7, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై చెరో 6 కేసులు, జెప్టోపై 5, హాస్టళ్లు, మాంసం దుకాణాలపై చెరో 4 కేసులు, ఐస్ తయారీ కేంద్రాలపై 3, చికెన్ వేస్ట్/సీ ఫుడ్‌పై 3 కేసులు దాఖలయ్యాయి.

విభాగాల సమన్వయంతోనే కల్తీకి చెక్!

ఆహార కల్తీ నివారణ అనేది కేవలం ఒకే విభాగానికి పరిమితమైన అంశం కాదని, బహుళ ప్రభుత్వ విభాగాల ఉమ్మడి బాధ్యత అని పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించారు. అందుకే హెచ్‌-ఫాస్ట్‌ విభాగం , జీహెచ్‌ఎంసీ, ఫుడ్‌ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సంపూర్ణ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పని చేస్తోంది. కల్తీ మూలాలను తుడిచిపెట్టడానికి ఆయా భాగస్వామ్య విభాగాల ఉన్నతాధికారులతో పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చర్యలు తీసుకుంటున్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం, కల్తీ నమూనాల సేకరణ వేగవంతం చేయడం, ఆకస్మిక తనిఖీలలో ఎదురయ్యే న్యాయ, క్షేత్రస్థాయి సవాళ్లను అధిగమించడంలో పరస్పర సహకారం లభిస్తోంది. ఈ బహుళ విభాగాల ఉమ్మడి సమన్వయం వల్లే నగరంలో కల్తీ దందాను విజయవంతంగా అడ్డుకోవడం సాధ్యపడుతోంది.

వ్యాపారులకు స్పష్టమైన ఆదేశాలు

కల్తీ నియంత్రణతో పాటు నివారణ చర్యలపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, తదితర తయారీ కేంద్రాలకు చెందిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యాపారం పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే పద్ధతులను ఏమాత్రం సహించబోమని వారికి నిర్మొహమాటంగా స్పష్టం చేస్తూ, కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను ప్రత్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగా గానీ ఫుడ్ బిజినెస్ తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రు విధిగా పాటించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యంతో, అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటూ . ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ వారి ప్రాణాలను హరించే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోం." అని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. ఎక్కడైనా ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా, లేదా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నట్లు తెలిసినా ఏమాత్రం సంకోచించకుండా వెంటనే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ నంబర్ 8712661212కు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

Next Story