ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్

by Dishanational1 |
ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు నిత్యం సరికొత్త సేవలతో ముందుకు వస్తున్న టీఎస్ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాకు బస్ సర్వీస్ లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఒడిశా, టీఎస్ ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరింది. బుధవారం హైదరాబాద్ లోని బస్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఒడిశా ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ కుమార్‌ పట్నాయక్‌ లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.


ఈ ఒప్పందం ప్రకారం ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో టీఎస్‌ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు, ఓఎస్‌ఆర్టీసీ 13 సర్వీస్‌లను తెలంగాణకు నడపనున్నారు. వీటిలో హైదరాబాద్‌-జైపూర్‌ 2, ఖమ్మం-రాయఘఢ 2, భవానిపట్న-విజయవాడ (వయా భద్రాచలం) 2, భద్రాచలం-జైపూర్‌ 4 బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడపనుండగా ఒడిశా ఆర్టీసీ నవరంగ్‌పూర్‌-హైదరాబాద్‌ 4, జైపూర్‌-హైదరాబాద్‌ 2, భవానిపట్న-విజయవాడ(వయా భద్రాచలం) 2, రాయఘఢ-కరీంనగర్‌ 2, జైపూర్‌-భద్రాచలం 3 బస్సులను నడపనుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా సాగుతుండటం, డిమాండ్ నేపథ్యంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ తీసుకువచ్చిన పలు కార్యక్రమాలను ఒడిశా అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ రాష్ట్రంలోనూ వాటిని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఓఎస్‌ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Next Story

Most Viewed