టాక్స్ @ రూ.1681 కోట్లు.. టార్గెట్ చేరని జీహెచ్ఎంసీ టాక్స్ కలెక్షన్

by Dishafeatures2 |
టాక్స్ @ రూ.1681 కోట్లు.. టార్గెట్ చేరని జీహెచ్ఎంసీ టాక్స్ కలెక్షన్
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఈ ఏటా నిరాశనే మిగిల్చింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిన సిబ్బందికి ఈ సంవత్సరం అదనపు విధులు నిర్వర్తించటంతో లక్ష్యంగా పెట్టుకున్న రూ.2 వేల కోట్ల టార్గెట్‌ను అధిగమించలేకపోయారు. ఈ సంవత్సరం కేవలం రూ.1681.72 కోట్లు మాత్రమే వసూలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. పక్షం రోజుల క్రితం వరకు సిబ్బందిలో ఎక్కువ శాతం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటంతో క్షేత్రస్థాయి కలెక్షన్ చాలా వరకు స్తంభించింది. ఎలక్షన్ విధులు ముగిసిన తర్వాత కూడా ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు వారి డాకెట్ల ప్రకారం నిర్ణయించిన టార్గెట్ల ప్రకారం పన్ను వసూలు చేయలేకపోయారు. అసలే ఆర్థిక సంక్షోభం కొట్టుమిట్టాడుతున్న సమయంలో 2022-23 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ 2021-22 సంవత్సరం కన్నా తక్కువ కలెక్షన్ కావటంపై అధికారులు కారణాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం.

నెలరోజుల్లో రూ.వెయ్యి కోట్ల టార్గెట్

కొత్త ఆర్థిక సంవత్సరం శనివారం నుంచే ప్రారంభమైనప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్‌ను ముందుగానే చెల్లించే బకాయిదారులకు ఐదు శాతం రిబేటునిస్తూ అమలు చేయాల్సిన ఎర్లీబర్డ్ స్కీం అమలు ఆదివారం నుంచి మొదలుకానుంది. ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ఏప్రిల్ నెల మొత్తం ఐదుశాతం రిబేటు ఇవ్వనున్నారు. ఈ ఒక్క నెలలోనే కనీసం రూ.వెయ్యి కోట్ల ట్యాక్స్ వసూలు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు సమాచారం. గత సంవత్సరం ఎర్లీ బర్డ్ స్కీంతో రూ.740 కోట్లను వసూలు చేశామని, ఈ సారి అదనంగా మరో రూ.260 కోట్లు తేలిగ్గా వసూలవుతుందని అధికారులు ధీమాతో ఉన్నారు.

టార్గెట్లు.. కలెక్షన్లు

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు నగరంలోని ఆరు జోన్లకు కలెక్షన్ టార్గెట్లు ఇచ్చారు. వాటి వివరాలిలా ఉన్నాయి. అన్ని జోన్లకు కలిపి రూ.2 వేల కోట్ల టార్గెట్లు ఇవ్వగా, వీటిలో కలెక్షన్‌లో ఖైరతాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ జోన్‌కు అధికారులు రూ.585 కోట్ల టార్గెట్ ఇవ్వగా, మార్చి నెలాఖరుకల్లా రూ.435.57 కోట్లు వసూలు చేయగా, ఇక ఎప్పటిలాగే చివరి స్థానంలో చార్మినార్ జోన్ ఉంది. ఈ జోన్‌కు అధికారులు రూ.172 కోట్ల వసూళ్ల లక్ష్యం ఇవ్వగా చివరి నిమిషం వరకు కేవలం రూ.122.86 కోట్ల వసూలు చేసింది.

జోన్ టార్గెట్ కలెక్షన్

ఎల్బీనగర్ 262.00 259.06

చార్మినార్ 172.00 122.86

ఖైరతాబాద్ 585.00 435.57

శేరిలింగంపల్లి 393.00 348.60

కూకట్ పల్లి 295.00 282.18

సికిందరాబాద్ 293.00 233.44

మొత్తం 2000.00 1681.72

Next Story

Most Viewed