పార్కుపై ప్రైవేటు కబ్జా: జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం బహిర్గతం

by Naga Rani Yarlagadda |

మూసాపేట్ సర్కిల్ ఫతేనగర్ డివజన్‌లోని అక్షయ ఎన్‌క్లేవ్ కాలనీలోని సుమారు వెయ్యి గజాల ఖాళీ స్థలంలో 2021 డిసెంబర్ 29న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీష్​ గౌడ్‌తో కలిసి సుమారు రూ.10 లక్షల వ్యయంతో అక్షయ ఎన్‌క్లేవ్ పార్కు అభివృద్ధి పనులను చేపట్టారు.

పార్కుపై ప్రైవేటు కబ్జా: జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం బహిర్గతం
X

దిశ, కూకట్‌పల్లి : జీహెచ్‌ఎంసీ పార్కుకు సైతం రక్షణ లేకుండా పోయింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు మొద్దు నిద్రలో ఉంటే ప్రైవేటు వ్యక్తి వచ్చి ఏకంగా పార్కులో ఉన్న మొక్కలను, వాకింగ్ ట్రాక్‌ను జేసీబీ సహాయంతో చదును చేసి స్థలం తనదంటు మూడు బోర్డులు ఏర్పాటు చేశాడు. మూసాపేట్ సర్కిల్ ఫతేనగర్ డివజన్‌లోని అక్షయ ఎన్‌క్లేవ్ కాలనీలోని సుమారు వెయ్యి గజాల ఖాళీ స్థలంలో 2021 డిసెంబర్ 29న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీష్​ గౌడ్‌తో కలిసి సుమారు రూ.10 లక్షల వ్యయంతో అక్షయ ఎన్‌క్లేవ్ పార్కు అభివృద్ధి పనులను చేపట్టారు. పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో లేకపోవడం, పార్కు పూర్తిగా మూత్ర విసర్జనకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీంతో కొంత మంది కన్ను ఈ పార్కుపై పడింది. కొన్ని రోజుల క్రితం కొంత మంది పార్కు స్థలంలో పట్టపగలే జేసీబీ సాయంతో పార్కులోని మొక్కలు, వాకింగ్ ట్రాక్‌ను తొలగించారు.

ఇదంతా పట్ట పగలే జరిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు తమకు సమాచారం లేదని సమాధానం ఇస్తున్నారు. పార్కును అభివృద్ధి చేసిన ఇంజినీరింగ్, నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన ఉద్యానవన శాఖ అధికారులు సైతం స్పందించకపోవడంతో పార్కు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా అక్షయ ఎన్ క్లేవ్ పార్కు ఏకంగా స్థానిక కార్పొరేటర్ కార్యాలయానికి ఎదురుగా ఉంది. అక్షయ ఎన్‌క్లేవ్ పార్కును ప్రైవేటు వ్యక్తులు చదును చేసి దిస్ లాండ్ బిలాంగ్స్ టు సీహె.శ్రీనివాస్​రావు అండ్​అదర్స్ అంటు మూడు బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా అక్షయ ఎన్‌క్లేవ్ పార్కు కబ్జా విషయం గురించి వివరణ కోరేందుకు ‘దిశ’ డీసీ వంశీకృష్ణను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. అంతే కాకుండా డీసీ ప్రజా సమస్యలపై స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం : రమేశ్, ఈఈ, మూసాపేట్ సర్కిల్

అక్షయ ఎన్‌క్లేవ్​పార్కు కబ్జా విషయంపై టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. పార్కు కబ్జా విషయం గురించి సమాచారం ఆలస్యంగా అందింది.

అధికారులు పట్టించుకోవడం లేదు : చీటకోరు కృష్ణ, కాంగ్రెస్ యువజన కార్యదర్శి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

ఫతేనగర్ డివిజన్ అక్షయ ఎన్‌క్లేవ్​పార్కు కబ్జా విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదు. కార్పొరేటర్​కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కు కబ్జాకుగురైన కార్పొరేటర్ పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి వెంటనే పార్కును కబ్జా నుంచి కాపాడాలి.

Next Story