రెడ్ నోటీసులు

by Disha Web Desk 12 |
రెడ్ నోటీసులు
X

దిశ, సిటీబ్యూరో :మహానగరంలోని కోటిన్నర మందికి అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ పెద్ద మొత్తంలో బకాయిపడ్డ ఆస్తుల యజమానులకు జీహెచ్ఎంసీ రెడ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఒక వైపు రోజురోజుకు ఆర్థిక సంక్షోభం తీవ్రం కావడంతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ ఆశించిన స్థాయిలో వసూలు కాకపోవటంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బల్దియా నవంబర్ జీతాలను ఇంకా చెల్లిస్తూనే ఉంది. అప్పులు పెరిగిపోవటం, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ మినహా మిగిలిన ఆదాయ మార్గలేమీ లేకపోవటంతో అధికారులు కూడా రోజువారీ వసూలవుతున్న ట్యాక్స్ కలెక్షన్‌ను ఉద్యోగులకు జీతాలుగా చెల్లిస్తున్నందున, పెద్దమొత్తంలో ట్యాక్స్ బకాయిపడ్డ ఆస్తుల యజమానుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మహానగరంలోని 30 సర్కిళ్లలో సుమారు 300 డాకెట్లలో దాదాపు పదమూడున్నర లక్షల మంది బకాయిదారులు జీహెచ్ఎంసీకి ప్రతిఏటా పన్ను చెల్లిస్తున్నారు.

వీరిలో పెద్ద మొత్తంలో చాలా కాలంగా బాకీ ఉన్న బకాయిదారుల జాబితాను తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం జీతాల చెల్లింపులకు అష్టకష్టాలు పడుతున్నందున, కనీసం వచ్చే నెలనైనా ఇలాంటి గడ్డుపరిస్థితులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మొండి బకాయిదాల యజమానులందరికి తొలుత రెడ్ నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత అవసరమైతే ఉన్నతాధికారులను కలెక్షన్ కోసం, బకాయిదారులతో సంప్రదింపుల కోసం పంపాలని జీహెచ్ఎంసీ యోచిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే వన్ టైమ్ సెటిల్‌మెంట్ దిశగా ఈ సంప్రదింపులు జరపాలని భావిస్తున్నట్లు సమాచారం. పెద్ద మొత్తంలో బకాయిపడ్డ యజమానులతో జోనల్‌స్థాయి అధికారులు, అవసరమైతే ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్లు సైతం చర్చలకు వెళ్లేందుకు వీలుగా త్వరలోనే ఆదేశాలు వెలువడే అవకాశాలున్నాయి.

105 రోజులు..రూ.915 కోట్లు..

వర్తమాన ఆర్థిక సంవత్సరం (2023-24)లో లక్ష్యంగా పెట్టుకున్న రూ.2,100 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్‌లో భాగంగా ఇప్పటి వరకు కేవలం రూ.1,185 కోట్లు మాత్రమే వసూలు చేశారు. రానున్న డిసెంబర్‌లోని 15 రోజులతో పాటు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలాఖరుకల్లా ఉన్న 90 రోజులతో కలిపి 105 రోజుల్లో టార్గెట్‌కు తగినట్టుగా రూ.915 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్‌ను వసూలు చేయాల్సి ఉంది. గతంలో ఎక్కువగా ఆస్తిపన్ను వసూలు చేసే 300 మంది బిల్ కలెక్టర్లకు, 150 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లకు వారు వసూలు చేసిన పన్నును బట్టి ఇన్సెంటీవ్స్ ఇచ్చేవారు. క్రమంగా ఈ సాంప్రదాయాన్ని నిలిపేసిన అధికారులు ఈసారి మరింత ఎక్కువగా పన్ను వసూలు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మళ్లీ ఇన్సెంటీవ్స్ విధానాన్ని తెరపైకి తేవాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ నెలాఖరు దాటితే చెల్లించాల్సిన ట్యాక్స్ పై జనవరి 1వ తేదీ నుంచి రెండు శాతం వడ్డీని వర్తింపజేయనున్నారు.

Next Story

Most Viewed