Ts News: ప్రభుత్వ ఖజానాకు ‘వైన్స్’ కిక్కు

by Disha Web Desk 16 |
Ts News: ప్రభుత్వ ఖజానాకు ‘వైన్స్’ కిక్కు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ప్రభుత్వ ఖజానాకు ఎక్సయిజ్ శాఖ కిక్కిచ్చింది. వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది. నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల ముందే వైన్ షాపుల టెండర్లను ఆహ్వానించింది. దీంతో 2,620 మద్యం దుకాణాలకు 1.30 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ‘నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు’ కింద ప్రభుత్వానికి రూ. 2600 కోట్ల ఆదాయం సమకూరింది. 22 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడంతో వాటిని మినహాయించి, మిగతా దుకాణాలకు ఇటీవల లక్కీ డ్రా నిర్వహించి దుకాణాలను కేటాయించారు. దీంతో దుకాణాలను దక్కించుకున్న వారు మొదటి విడత లైసెన్స్ ఫీజును చెల్లించారు. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 3200 కోట్ల ఆదాయం జమైంది.

ఎలక్షన్స్ టైమ్‌లో ఫుల్ గిరాకీ

ఎలక్షమ్స్ టైమ్ కావడంతో ప్రస్తుత వైన్ షాపు నిర్వాహకులతోపాటు కొత్త దుకాణాలు దక్కించుకున్న వారు సైతం ఆనందంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం వైన్ షాపుల గడువు నవంబర్ 30 వరకు ఉన్నది. కొత్తగా టెండర్ దక్కించుకున్న వారు డిసెంబర్ ఫస్ట్ నుంచి దుకాణాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు ఉంటుండడంతో నవంబర్ ఆఖరు వరకు ప్రస్తుత దుకాణ నిర్వాహకులకు, డిసెంబర్ తర్వాత కొత్త దుకాణదారులకు గిరాకీ జోరుగా జరిగే అవకాశముంది. అసెంబ్లీ తర్వాత ఆరునెలలకు పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తుండడంతో గిరాకీకి ఢోకా ఉంటుందని లక్కీ డ్రాలో షాపులు దక్కించుకున్న వారు భావిస్తున్నారు.


Next Story