విశ్వనగరమా..? శునక నగరమా..?

by Disha Web Desk 12 |
విశ్వనగరమా..? శునక నగరమా..?
X

దిశ, సిటీ బ్యూరో: రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం, జీహెచ్ఎంసీ అధికారుల పుణ్యమా అని హైదరాబాద్ విశ్వనగరమా? శునక నగరమా? అనే అనుమానం కలుగుతున్నది. మహానగరంలో కుక్కల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రతి గల్లీలో వందల సంఖ్యలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్నపిల్లలను, వృద్ధులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి.

కుక్క కాటుకు యాంటీ రేబిస్ ఇంజక్షన్ అందుబాటులో ఉండే ఐపీఎంతో పాటు ఫీవర్ ఆస్పత్రికి రోజుకు 50 కేసులు వస్తున్నాయి. ఇక మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి ఒక్క ఫీవర్ ఆస్పత్రికే రోజుకు 1500 కేసులు వస్తున్నట్లు సమాచారం.

నిధులు వెచ్చిస్తున్నారా? మింగేస్తున్నారా?

కుక్కల నియంత్రణ పేరిట బల్దియా బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులన్నీ వెటర్నరీ విభాగంలో లాంగ్ స్టాండింగ్‌గా తిష్ట వేసిన అధికారుల బినామీ కాంట్రాక్టుల ఖాతాల్లోకి చేరుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం శేరిలింగంపల్లి సర్కిల్‌లోని వెటర్నరీ విభాగంలో కీలక విధులు నిర్వర్తించే ఓ అధికారి శంషాబాద్ వద్ద ఏకంగా రూ.3 కోట్ల విల్లాను నిర్మించారంటే వారి అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో అంచనా వేసుకోచ్చు.

కొన్నేళ్ల క్రితం వరకు ప్రధాన కార్యాలయంలోని వెటర్నరీ విభాగంలో కీలకమైన విధులు నిర్వర్తించిన మరో అధికారి తన స్వస్థలంలో వందలాది ఎకరాల భూములను కొనుగోలు చేసి, రిటైర్మెంట్ తర్వాత అక్కడికెళ్లి స్థిరపడ్డారు. ఈ డబ్బంతా ఎక్కడిదనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. ఇప్పటికైనా సర్కారు, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి కుక్కల నియంత్రణపై దృష్టి సారించకుంటే విశ్వనగరంలో నగరవాసుల కన్నా కుక్కల జనాభా ఎక్కువై శునక నగరంగా మారుతుందన్న అనుమానం వ్యక్తమవుతున్నది.


Next Story

Most Viewed