వైద్య వృత్తిలో డాక్టర్లకు ఓపిక అవసరం

by Sridhar Babu |   (  Updated:2024-01-27 13:10:35  IST  )

డాక్టర్లు తమ వృత్తిలో ఎంతో ఓపికతో వ్యవహరించాలని, ప్రతి రోగికి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు శాయశక్తులా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళసై అన్నారు.

వైద్య వృత్తిలో డాక్టర్లకు ఓపిక అవసరం
X

దిశ, శేరిలింగంపల్లి : డాక్టర్లు తమ వృత్తిలో ఎంతో ఓపికతో వ్యవహరించాలని, ప్రతి రోగికి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు శాయశక్తులా కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళసై అన్నారు. మాదాపూర్ యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ పై మూడు రోజులపాటు జరగనున్న అంతర్జాతయ సదస్సును శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ప్రారంభించారు. ఈ సదస్సులో వివిధ దేశాల నుండి 30మందికి పైగా నెఫ్రాలజిస్ట్ లు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కిడ్నీ వ్యాధుల పైన ప్రజలకు అవగాహన చాలా తక్కువని, దీనిపై వారికి అర్థం అయ్యేలా చెప్పడం చాలా కష్టంగా ఉండేదని అన్నారు.

ప్రజల్లో సరైన అవగాహన లేక పోవడంతో కిడ్నీ సమస్యలని సాధారణ సమస్యలుగా భావించి స్థానిక వైద్యులను సంప్రదిస్తున్నారని, కానీ నెఫ్రాలజీ లని సంప్రదించడం లేదని గుర్తు చేశారు. కిడ్నీ సమస్యల పై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని అందుకు ఆస్పత్రులు సహకరించాలని సూచించారు. కిడ్నీ సమస్యలకు సంబంధించిన వైద్య చికిత్సలు ఆయుష్మాన్ భారత్ లో ఉన్నాయని, ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వైద్య చికిత్సల కోసం ప్రజలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సి

ఉంటుందని, అలాంటివారికి ఆయుష్మాన్ భారత్ వరం లాంటిదని అన్నారు. వైద్య వృత్తి ఎంతో నమ్మకాన్ని కల్పిస్తుందని, తాను తెలంగాణ గవర్నర్ గా వచ్చినప్పుడు యంగ్ స్టేట్ ని లేడీ ఎలా మ్యానేజ్ చేస్తుంది అన్నారని, కానీ తాను గైనిక్ డాక్టర్ నని తప్పకుండా మేనేజ్ చేయగలను అని తన సన్నిహితులతో అన్నట్లు గుర్తు చేసుకున్నారు. అలాగే పుదిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అవకాశం కల్పించినప్పుడు అదేమాట అన్నారని, కానీ కవలలకు జన్మనిచ్చిన వైద్యురాలిగా తాను మేనేజ్ చేయగలను అని కాన్ఫిడెంట్ గా చెప్పానని, వైద్య వృత్తిలో ఉన్నవారు ఓపికగా ఉండాలని, పేషెంట్ తో ఉండాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యశోద డాక్టర్లతో పాటు పలు దేశాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు.

Next Story