కొడంగల్ తరహాలోనే మరిన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు: డిప్యూటీ సీఎం భట్టి

by Disha Web Desk 16 |
కొడంగల్ తరహాలోనే మరిన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అందుక‌నే మొద‌టి శుక్రవారం రోజునే ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశామ‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్రమార్క మ‌ల్లు తెలిపారు. రంజాన్ ఏర్పాట్లకు నిధుల కొర‌త లేద‌న్నారు. ఈ నెల 15న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. బందోబ‌స్తు, పార్కింగ్‌, విద్యుత్తు, మెడిక‌ల్‌, వాట‌ర్ స‌ర‌ఫ‌రా, ఫ్రోటోకాల్‌, ర‌వాణా త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఏలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులందరు సమన్వయంతో పని చేయాలని, ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, పోలీస్, సమాచార శాఖ, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్‌ బీ, విద్యుత్, వాటర్ బోర్డ్ , అగ్నిమాపక శాఖ తదితర శాఖలు ప్రణాళిక బద్దంగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం రోజున ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంకు మైనార్టీల పట్ల ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నదని అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.2263 కోట్ల బడ్జెట్‌లో కేటాయించిందని అన్నారు. గడిచిన మూడు నెలలో మైనారిటీల సంక్షేమానికి రూ.478.56 కోట్లు ఖర్చు చేశామన్నారు.


కొడంగల్ తరహాలోనే మరిన్ని ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు...

కొడంగల్‌లో ఇంటిగ్రేటెడ్ తరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు డిప్యూటి సీఎం భ‌ట్టి విక్రమార్క తెలిపారు. అద్దె భవనాల్లో నడుస్తున్న మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను సొంత భవనాల్లో నిర్మించేందుకు స్థలాలను సేకరించాల్సిందిగా ఆదేశించామని ఆయన తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖలో మొత్తం ఐదు చైర్మన్ పోస్టులు నియమించడంతో పాటు హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో లైన్, మీర్-ఆలమ్‌లో కేబుల్ వంతెనను నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో ముస్లీమ్ సోదరులు నమాజ్ చేయుటకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఈ స‌మావేశంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లాహ్ హుస్సేనీ, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, హజ్ కమిటీ చైర్మన్ అఫ్జల్ , క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపాక్ జాన్, సీఎం కార్యదర్శి షానవాజ్‌ ఖాసీం, జి.హెచ్.యం.సి కమీషనర్ రోనాల్డ్ రోస్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ హనుమంత రావు, నగర అదనపు పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ , మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి తఫ్సీర్ ఇక్బాల్, కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed