వారిని క్రమబద్ధీకరించండి.. సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ

by Disha Web Desk 16 |
వారిని క్రమబద్ధీకరించండి.. సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో 2100 ఖాళీలు ఉన్నప్పటికీ 1335 మంది అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 1335మంది కాంట్రాక్ట్‌ అధ్యాపకులుగా గత 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారన్నారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం వీరికి తగిన అర్హతలు ఉన్నప్పటికీ నేటికీ ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోలేదని తెలిపారు. కొంతమేరకు సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌ పూర్తిచేసినప్పటికీ రెగ్యులరైజేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం పెండింగులోనే ఉంచిందని వెల్లడించారు.

జీవో నెం.16 ప్రకారం డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకుల సర్వీసులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసిందన్నారు. కానీ అదే తరహాలో అర్హులైన విశ్వవిద్యాలయాల కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత విద్యాభివృద్ధికి, విద్యార్ధులను తీర్చిదిద్డడంలోను, పరిశోధనారంగంలోను అధ్యాపకులు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా లేఖలో పేర్కొన్నారు

Next Story

Most Viewed