కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

by Kavya |
కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
X

దిశ, చైతన్యపురి : సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని మార్ఫింగ్ చేసిన లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన దారుణమైన ఉగ్రవాదదాడిని నిరసిస్తూ బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టి ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసినట్లు తెలిపారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ కార్పొరేటర్లు, వివిధ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా తీవ్రవాదుల దిష్టిబొమ్మను మార్ఫింగ్ చేస్తూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నట్లు చిత్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను అప్ లోడ్ చేయడంతో తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఘటనకి పాల్పడిన కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా తరపున లిఖితపూర్వకంగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి బండి సంజయ్ లను ఏకవచనంతో మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మార్ఫింగ్ చేయడం అనేది చట్ట రిత్యా నేరమని, బీజేపీ కార్యకర్తలు, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. లింగోజిగూడ డివిజన్ లో బంగ్లాదేశ్ నుండి అక్రమచొరబాటుదారులు చాలామంది ఉన్నారని ముందు దాని మీద దృష్టి సారించాలని హితవు పలికారు. కాంగ్రెస్ కార్పొరేటర్ పై చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ సిఐ సైదిరెడ్డి ని కోరారు. ఈకార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు శ్రీధర్ రెడ్డి, కృష్ణంరాజు, కిరణ్, శ్రవణ్ గౌడ్, దామ రాకేష్ యాదవ్, సతీష్, శివ రామ్, గిరీష్, టీంకు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed