సైబర్ నేరాల నిర్మూలనకు సమష్టి కృషి అవసరం

by Taduka Kalyani |

డిజిటల్ మోసాలు కేవలం సైబర్ సమస్య మాత్రమే కాదని, అవి సామాజిక, ఆర్థిక ముప్పుగా మారాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.

సైబర్ నేరాల నిర్మూలనకు సమష్టి కృషి అవసరం
X

దిశ, కార్వాన్ : డిజిటల్ మోసాలు కేవలం సైబర్ సమస్య మాత్రమే కాదని, అవి సామాజిక, ఆర్థిక ముప్పుగా మారాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌కు మ్యూల్ అకౌంట్లు, మోసపూరిత సిమ్ కార్డులే (ఘోస్ట్ సిమ్స్) ప్రాణాధారమని, బ్యాంకులు, టెలికాం సంస్థలు, చట్ట అమలు సంస్థలు సమన్వయంతో పనిచేసి వీటిని పూర్తిగా నిర్మూలించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం నాంపల్లి రెడ్ హిల్స్‌ లోని ఫెడరేషన్ హౌస్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ), హైదరాబాద్ సిటీ పోలీస్ సంయుక్తంగా, ప్రొటివిటీ ఇండియాతో కలిసి నిర్వహించిన “డిజిటల్ ట్రస్ట్ & సిటిజన్ ప్రొటెక్షన్” జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కోసం రూపొందించిన ‘సిటిజన్స్ హ్యాండ్‌బుక్’ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సి పీ మాట్లాడుతూ.. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయడం అత్యంత కీలకమని, ఎంత త్వరగా స్పందిస్తే బాధితుల సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోనే రోజుకు సుమారు రూ. 1 కోటి మేర సైబర్ మోసాలు జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా రోజుకు 10,000కు పైగా కేసులు నమోదవుతున్నాయని నిపుణులు వెల్లడించారు. భవిష్యత్తులో బ్యాంకులు తమ సంస్థలో ఒక్క మ్యూల్ అకౌంట్ కూడా లేదని గర్వంగా ప్రకటించుకునే స్థాయికి చేరాలని సీపీ ఆకాంక్షించారు. మోసం జరిగిన తర్వాత పరిష్కారం కంటే, ముందస్తు అవగాహన ద్వారా నివారణే సైబర్ నేరాలపై పోరాటంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం అని అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పోలీస్ అధికారులు, బ్యాంకింగ్, సైబర్ భద్రత, టెలికాం, న్యాయ నిపుణులు మరియు విధాన రూపకర్తలతో కలిపి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

మానవ ప్రవర్తన & డిజిటల్ ట్రస్ట్

బ్యాంకింగ్ రూపాంతరణ (ట్రాన్స్‌ఫర్మేషన్)

టెలికాం & డిజిటల్ గుర్తింపు (ఐడెంటిటీ)

రెగ్యులేటరీ & లెజిస్లేటివ్ సంస్కరణలు

ఏ ఐ,డీప్‌ఫేక్‌లు & భవిష్యత్ మోసాలు

ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు శ్రీ ఆర్. రవికుమార్, ఐసీటీ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా (దాదాపు 25 బిలియన్లు) డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న దేశంగా నిలిచిందని, అదే సమయంలో భద్రతను పటిష్టం చేయడం సవాలుగా మారిందని అన్నారు. సాంకేతికతతో పాటు అవగాహన, బాధ్యతగల నియంత్రణ ద్వారానే డిజిటల్ నమ్మకాన్ని (ట్రస్ట్‌) నిర్మించగలమని స్పష్టం చేశారు. ఈ చర్చల సారాంశంతో త్వరలోనే ఒక వైట్ పేపర్ విడుదల చేయనున్నట్లు ఎఫ్‌టీసీసీఐ ప్రకటించింది.

Next Story