Hyd: యూట్యూబ్​ వీడియోలు చూసి...!

by Vemula.Srinu Prasad |

మహిపాల్...ఆన్​లైన్​గేముల్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద అయినకాడికి అప్పులు చేశారు...

Hyd: యూట్యూబ్​ వీడియోలు చూసి...!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో/శేరిలింగంపల్లి: మహిపాల్...ఆన్​లైన్​గేముల్లో ఉన్నదంతా పోగొట్టుకున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద అయినకాడికి అప్పులు చేశారు. బాకీలు తీర్చాలని ఒత్తిడి రావటంతో చెయిన్ ​స్నాచింగులు మొదలుపెట్టారు. దీనికోసం యూట్యూబ్​లో వీడియోలు చూసి మరీ రాటుదేలి వరుసగా నేరాలకు పాల్పడుతూ చివరకు మాదాపూర్ ​పోలీసుల చేతికి చిక్కారు.

మాదాపూర్​డీసీపీ సందీప్​రావు సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ ​జిల్లా నెక్కొండ మండలం చిన్నకొర్పోల్​ గ్రామానికి చెందిన మహిపాల్​(27) ఉపాధి కోసం కొంతకాలం క్రితం హైదరాబాద్​వచ్చారు. మొదట కొన్నాళ్లు డ్రైవర్​గా పని చేసి ఆ తరువాత ఓ ఫర్నీచర్ ​షాపులో ఉద్యోగం చేశారు.

అయితే ఆన్​లైన్​లో జూదం ఆడటానికి అలవాటు పడ్డ మహిపాల్​సంపాదించిన డబ్బు మొత్తం పోగొట్టుకున్నారు. అయినా అలవాటును మాత్రం మానుకోలేకపోయారు. మిత్రులు, బంధువుల వద్ద పెద్ద మొత్తాల్లో అప్పులు చేసి మరీ ఆన్​లైన్​జూదం ఆడి ఆ డబ్బు కూడా పోగొట్టుకున్నారు. అదే సమయంలో అతనికి అప్పులు ఇచ్చిన స్నేహితులు, బంధువులు బాకీలు తీర్చాలంటూ ఒత్తిడి తెచ్చారు.

యూ ట్యూబ్​లో వీడియోలు చూసి...

దీంతో చేసిన అప్పులు తీర్చుకోవటంతోపాటు డబ్బు సంపాదించటానికి చెయిన్​ స్నాచింగులు చేయాలని మహిపాల్​నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో యూట్యూబ్ ఛానల్‌​లో చెయిన్​ స్నాచింగులకు సంబంధించిన వీడియోలు చూసి రాటుదేలారు. మార్నింగ్​ వాక్​కోసం ఇళ్లలో నుంచి బయటకు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలు చేయటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బోరబండ వివేకానందనగర్ ​నివాసి ఆర్.కున్నమ్మ (53) గతనెల 28న సాయంత్రం 6.15గంటల సమయంలో భర్త వల్లభయ్యతో కలిసి వాకింగ్​చేస్తూ పర్వత్​నగర్​వైపు వెళుతుండగా ఆమె మెడలోని నాలుగు తులాల మంగళసూత్రాలు తెంచుకుని ఉడాయించారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా మాదాపూర్​డీఐ వెంకట్, సీఐ తిరుపతి, సీసీఎస్​సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి మహిపాల్​ను సోమవారం అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు ఏప్రిల్​13న అల్లాపూర్​గాయత్రినగర్ ​నివాసి సత్యవతి మెడలో నుంచి 3తులాల బంగారు గొలుసును తెంచుకుని ఉడాయించినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు నిందితుడి నుంచి రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు

Next Story