ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై కేబినెట్ సబ్ కమిటీ కీలక ఆదేశాలు

by Disha Web Desk 16 |
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై కేబినెట్ సబ్ కమిటీ కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీవో నంబర్ 58, 59 కింద ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. వారం రోజుల్లో ప్రక్రియ‌ను పూర్తి చేసి మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. శుక్రవారం బీఆర్కే భ‌వ‌న్ లో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై స‌బ్ క‌మిటీ చ‌ర్చించింది. సీఎం ఆదేశాల మేరకు, ఏ జిల్లాల్లో ఎన్ని ప‌ట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయో గుర్తించి, జాబితాను సిద్ధం చేయాల‌ని సీసీఎల్ఏను స‌బ్ క‌మిటీ ఆదేశించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు అందేలా చూడాలని స్పష్టం చేసింది. పెండింగ్లో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌ను త్వరగా ప‌రిశీలించి, పంపిణీకి సిద్దం చేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు రోజువారీగా సమీక్షలు నిర్వహించి, ప్రక్రియ వేగ‌వంతం చేయాల‌ని పేర్కొంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న పేద‌ల‌కు హక్కులు కల్పించి, వారి జీవితాల్లో ఆనందం నింపాల‌న్నదే కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొంటూ ఆ దిశగా అందరూ కృషి చేసి, అర్హులైన వారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనం చేకూర్చాలని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఇతర ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.


Next Story