ఆ ప్రచారాన్ని తిప్పికొట్టండి.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో దాసోజు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
ఆ ప్రచారాన్ని తిప్పికొట్టండి.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో దాసోజు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్ డివిజన్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇంచార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ మహానేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యారని, తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలపై ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ముఖ్యమంత్రిగా 9 ఏండ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9ఏళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు.

జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు

జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించుకుందామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పిలుపు మేరకు. దశాబ్ది ఉత్సవాలను దేదీప్యమానంగా నిర్వహించాలన్నారు. ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది…? అన్న విషయాన్ని ప్రజలకు కండ్లకు కట్టినట్టు వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మూడు వారాలపాటు దద్దరిల్లాలని.. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం తీసుకరావాలని దాసోజు శ్రవణ్ అన్నారు.

చంద్రశేఖరుడు కూడా పరమేశ్వరుడే

‘శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. మన బాధకు , సుఖానికి , దుఃఖానికి , సంతోషానికి ఇలా అన్నింటికీ శివుడే కారణం. అయన పరమేశ్వరుడు..ఈరోజు మన తెలంగాణను ఏలుతున్న చంద్రశేఖరుడు కూడా పరమేశ్వరుడే. అందుకే భారతదేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా కేసీఆర్ ప్రజల గురించి ఆలోచిస్తూ వారిని కష్టాల నుంచి బయటపడేస్తున్నారు. ముఖ్యముగా పేద ప్రజల గురించి ప్రతి కష్ణం ఆలోచిస్తూ.. వారి బాగోగులు చూసుకుంటూ, వారి కష్ట సుఖాలఫై ఆరా తీస్తూ వారి బ్రతుకుల్లో వెలుగు నింపుతున్న దేవుడు కేసీఆర్.’ అని తెలిపారు.

అభివృద్ధి చూస్తున్నాం

ఈరోజు కేసీఆర్ తెలంగాణను ఎంతగా అభివృద్ధి చేసారో చూస్తున్నాం. తెలంగాణ వచ్చిన సమయంలో 50 వేల కోట్ల ఉన్న బడ్జెట్.. ఈరోజు మూడు లక్షలకు తీసుకొచ్చారు. ఎన్నో సంక్షేమ పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, 200 ఉన్న పెన్షన్‌ను 2000లకు తీసుకొచ్చిన మహానాయకుడు కేసీఆర్. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్ తెలంగాణ‌ను ఎంతో అభివృద్ధి చేశారు. అలాంటి కేసీఆర్‌ని మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని దాసోజు శ్రవణ్ అన్నారు.

భారత దేశానికే తెలంగాణ తలమానికం

తెలంగాణ అంటే నేడు భారత దేశానికే తలమానికంగా ఉందన్నారు. వరి ఉత్పత్తిలో, కరెంట్ వినియోగంలో, ఉత్పత్తిలో తెలంగాణ నెం వన్ స్థానంలో ఉండేలా కేసీఆర్ చేశారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, మన ఊరు - మన బడి, రైతుబంధు, దళిత బంధు, బస్తి దవాఖానా, మిషన్ భగీరధ ఇలా ఎన్నో పథకాలు తీసుకొచ్చిననేతను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉంది. ఎన్నో ఆసరా పెన్షన్లు తీసుకొచ్చిన కేసీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయంలో పడేసేందుకు కుట్ర చేస్తున్నారు. అలంటి కుట్రలను తిప్పికొట్టాలి.’ అని దాసోజు శ్రవణ్ సూచించారు.

Read More... బీజేపీకి అధికారం ఇస్తే.. ఆర్‌ఎస్‌ఎస్‌ చేతికి తుపాకులు : ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌



Next Story

Most Viewed