బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో బీసీల ఊసేది ?

by Disha Web Desk 15 |
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో  బీసీల ఊసేది ?
X

దిశ, హిమాయత్ నగర్ : బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించిన ఏ అంశాన్ని చేర్చకపోవడం చాలా బాధాకరమని, బీసీలకు చట్టసభలు, రిజర్వేషన్లు, బీసీల సమగ్ర కుటుంబ సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు అనే విషయాలను చేర్చకపోవడం చాలా అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వివిధ బీసీ సంఘాల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిందని, ఇందులో కేవలం ఓటర్లను ఆకర్షించే రాయితీలు సబ్సిడీల వరకే మేనిఫెస్టో పరిమితం చేసి, మెజార్టీ ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలను విధానాలను మేనిఫెస్టోలో లేకపోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మారి భారతీయ రాష్ట్ర సమితి అయిన సందర్భంలో జాతీయస్థాయిలో ఉన్నటువంటి బీసీ డిమాండ్లను, అలాగే రాష్ట్రస్థాయిలో ఉన్నటువంటి బీసీ డిమాండ్లను మేనిఫెస్టోలో పొందుపరచవలసినటువంటి అవసరం ఉందని,

కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షలు తెలుసుకోకుండా కేవలం తాయిలాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయిన తర్వాత కూడా సమగ్ర కుటుంబ సర్వే లేదని, అలాగే ఇటీవల భారత దేశంలోనే అన్ని రాష్ట్రాలకు కనువిప్పు కలిగే విధంగా ఒక ఆదర్శంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో బీసీ కుల గణన నిర్వహించి కులగణన ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగిందని ఆయన అన్నారు. బీహార్ ను ఆదర్శంగా తీసుకుని ఇప్పటికే ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు కులగణను అధికారికంగా ప్రభుత్వం తరఫున నిర్వహించడం మొదలుపెట్టాయని, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంతవరకు కులగణన మీద కనీసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడకపోవడం బీసీలపై వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల ద్వారా ప్రచారాన్ని మొదలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు నిర్వహించినటువంటి బహిరంగ సభలో ఎక్కడా కూడా బీహార్ తరహా కులగణన చేస్తామని చెప్పడం లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ కులగణన చేస్తామని తమ మేనిఫెస్టోలో చేర్చి కేసీఆర్ ప్రచారం నిర్వహించే బహిరంగ సభలో ప్రకటించకపోతే దసరా తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టి బీసీలకు తామే ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను ప్రకటించిన 55 స్థానాలలో బీసీలకు కేవలం 12 స్థానాలు కేటాయించి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. అలాగే ఈ 12 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కనీస బలం లేనటువంటి ఓడిపోయే స్థానాలైనటువంటి

పాతబస్తీలో నాలుగు సీట్లను కేటాయించి, బీసీలను అవమానించిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ బీసీ కులగణ న నిర్వహిస్తామని, బీసీ మహిళ బిల్లులు, బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని, బీసీలకు సానుకూలంగా మాట్లాడుతుంటే ఇంకొక వైపు ఇక్కడి కాంగ్రెస్ రెడ్డి నేతలు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించి, గెలుపు గుర్రాల పేరుతో రెడ్డి, వెలమలకే ఎక్కువ స్థానాలు కేటాయించి సామాజిక న్యాయాన్ని తుంగలోకి తొక్కారని ఆయన మండిపడ్డారు. ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 17 అసెంబ్లీ స్థానాలను, ఆరు శాతం ఉన్న వెలమ సామాజిక వర్గానికి ఏడు స్థానాలను ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరి అవలంబిస్తే ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రకటించే అసెంబ్లీ స్థానాల్లో ఉదయపూర్

డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కచ్చితంగా ఇవ్వాలని అన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూదాని సదానందం, రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్, గూడూరు భాస్కర్ మేరు, బూడిద మల్లికార్జున యాదవ్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed