కరోనా కేవలం స్కూళ్లలోనే ఉందా.. జాజుల శ్రీనివాస్ సెటైర్

by Web Desk |
కరోనా కేవలం స్కూళ్లలోనే ఉందా.. జాజుల శ్రీనివాస్ సెటైర్
X

దిశ, ముషీరాబాద్: విద్యాసంస్థలను తక్షణమే ప్రారంభించాలని మార్చి 20వ తేదీన విద్యార్థి యువజనుల మహా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం బార్లకు, క్లబ్బులకు, సినిమా థియేటర్లకు విధించని ఆంక్షలు కేవలం విద్యాసంస్థలకు మాత్రమే ఎందుకు విధించిందని ప్రశ్నించారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బార్లకు, పబ్బులకు, సినిమా థియేటర్ల లాంటి బహిరంగ ప్రదేశాలకు వెళితే రాని కరోనా, కేవలం స్కూళ్లకు వెళితేనే వస్తుందా? అని మండిపడ్డారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు రెండు డోసుల వాక్సిన్ వేయించుకున్నారని, అయినప్పటికీ వారికి విద్యను అందించకపోవడం శోచనీయమన్నారు.

పక్క రాష్ట్రమైన ఏపీలో విద్యాసంస్థలు నడుస్తుంటే, ఇక్కడ మాత్రం విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, కేంద్రంలో, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెజారిటీ ప్రజలకు రాజకీయ అధికారం దక్కాలన్న ప్రధాన డిమాండ్‌తో మార్చి 20వ తేదీన వేలాది మంది బీసీ విద్యార్థి, యువజనులతో మహా సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఫిబ్రవరి నుండి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మ, ఎంబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు బడే సాబ్, బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు రావుల్ కోల్ నరేష్ ప్రజాపతి, యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed