నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి:టాప్రా జిల్లా అధ్యక్షుడు డిమాండ్

by Jakkula.Mamatha |

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి, ఈహెచ్‌ఎస్, నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు.

నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి:టాప్రా జిల్లా అధ్యక్షుడు డిమాండ్
X

దిశ,​హుజూరాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి, ఈహెచ్‌ఎస్, నూతన పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని టాప్రా కార్యాలయంలో అసోసియేషన్ హుజూరాబాద్ యూనిట్ అధ్యక్షుడు భారత ప్రభాకర్ అధ్యక్షతన ముఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అవలంబిస్తున్న విధివిధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధి విధానాలు లేకుండా మినహాయింపులు సరికాదు..

​ఉద్యోగ, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన విధివిధానాలు ప్రకటించకుండానే, ముందస్తుగా నిధుల మినహాయింపులు చేపట్టడం ఉద్యోగులను, పెన్షనర్లను మోసం చేయడమేనని జనార్దన్ విమర్శించారు. సాధారణంగా డ్రాయింగ్ అండ్ డిస్బర్స్‌మెంట్ అధికారులు చేయాల్సిన ఈ ప్రక్రియను, ఎలాంటి ఉత్తర్వులు లేకుండా సచివాలయంలోని ఫైనాన్స్ అధికారులు చేపట్టడం చట్టవిరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈహెచ్‌ఎస్ అమలుపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాతే మినహాయింపులు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

జూలై 2023 నుండి నూతన పీఆర్సీ వర్తింపజేయాలి..

​జేఏసీతో జరిపిన చర్చల్లో నెల రోజుల్లోగా పీఆర్సీ నివేదికను తెప్పించి అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం తక్షణమే నివేదికను తెప్పించుకుని, జూలై 2023 నుండి నూతన పీఆర్సీని కచ్చితంగా అమలు చేయాలని కోరారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పెన్షనర్లకు సంబంధించిన ఇతర పెండింగ్ బిల్లులన్నింటికీ తక్షణమే నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టాప్రా హుజూరాబాద్ యూనిట్ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, కోశాధికారి మండల వీరస్వామి, కార్యవర్గ సభ్యులు బొంగోని వెంకటయ్య, తాటిపాముల కనకయ్య, దొంత హరికిషన్, గూడూరి స్వామి రెడ్డి, గాజర్ల బుచ్చిరాజం, శబ్ద ప్రకాష్, నల్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story