డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డిన వ్య‌క్తి అరెస్ట్

by Ratna Kumari |

డిజిట‌ల్ అరెస్ట్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన‌ట్టు సైబ‌ర్ క్రైమ్ డీసీపీ సాయి మ‌నోహ‌ర్ తెలిపారు. తాజాగా విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న వివ‌రాలు వెల్ల‌డించారు.

డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో మోసాల‌కు పాల్ప‌డిన వ్య‌క్తి అరెస్ట్
X

దిశ, శేరిలింగంపల్లి : డిజిట‌ల్ అరెస్ట్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన‌ట్టు సైబ‌ర్ క్రైమ్ డీసీపీ సాయి మ‌నోహ‌ర్ తెలిపారు. తాజాగా విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న వివ‌రాలు వెల్ల‌డించారు. గ‌జ‌ర్ల అవినాష్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి అత‌ని వ‌ద్ద నుంచి రూ.12 ల‌క్ష‌లు రిక‌వ‌రీ చేసిన‌ట్టు తెలిపారు. బాలాన‌గ‌ర్ కి చెందిన స‌దానందం అనే వృద్ధుడిని డిజిట‌ల్ అరెస్ట్ చేసి రూ.42ల‌క్ష‌లు కొట్టేశారు. దాదాపు 15 రోజుల పాటు డిజిట‌ల్ అరెస్ట్ పేరుతో నిర్భంధించి డ‌బ్బు కాజేశాడు. కొట్టేసిన డ‌బ్బు నాలుగు మ్యూల్ అకౌంట్ల‌లోకి ట్రాన్స్ ఫ‌ర్ చేశాడు. నిందితుడు అవినాష్ డేటా ఎంట్రీ జాబ్ పేరుతో కొంత మందితో క‌లిసి కంబోడియా వెళ్లాడు. భార‌తీయుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని మోసాల‌కు పాల్ప‌డిన నెట్ వ‌ర్క్ లో చేరాడు. చాలా మందిని మాయ మాట‌ల‌తో బురిడి కొట్టించి దోచుకున్నారు. దోచుకున్న డ‌బ్బులో క‌మిష‌న్ రూపేణ ముట్ట‌చెప్పేవారు. ఆ త‌రువాత తానే స్వ‌యంగా కంబోడియా నుంచే సైబ‌ర్ మోసాలు చేయ‌డం ప్రారంభించాడు. ఫిబ్ర‌వరిలో బాలాన‌గ‌ర్ లో ఉండే వృద్ధుడికి కాల్ చేసి మొబైల్ నెంబ‌ర్ పై 17 కేసులున్నాయ‌ని భ‌య‌పెట్టాడు.

సీనియర్ సిటిజన్ ఇంట్లో విచారణ చేయాల‌ని భయపెట్టాడు. వీడియో కాల్ లో విచారణ పేరుతో మరో వ్యక్తి వచ్చి మీ మొబైల్ నెంబర్ అనేక వివాదంలో ఇరుక్కుంది అని భయపెట్టాడు. ఇలా బెదిరించి ఆ వృద్ధుడి వద్ద నుంచి విడతలవారీగా 42 లక్షలు నాలుగు అకౌంట్ లోకి మళ్ళించారు. కంబోడియాలో ఉంటూ అక్కడ వాళ్ళు కళ్ళగప్పి నిందితుడు అవినాష్ బాధితుడి డబ్బును తెలంగాణ, ఏపీలో ఉన్న మ్యూల్ అకౌంట్ లోకి మళ్ళించారు. ఇదే కేసు దర్యాప్తు లో భాగంగా వైజాగ్, ముంబాయి కు వెళ్లాం. అంతకుముందు ఇదే కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని.. వారిని భిన్న కోణాల్లో విచారిస్తే అవినాష్ చేస్తున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. మార్చిలో అవినాష్ ఇండియాకు వస్తున్నాడని సమాచారం తెలియ‌డంతో చాకచక్యంగా అత‌డిని అరెస్ట్ చేశామని వివరించారు. అరెస్ట్ సమయంలో కమీషన్ కింద అతను తీసుకున్న 12 లక్షలు కూడా స్వాధీన చేసుకున్నామని.. నిందితుడిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని వాటి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. డిజిటల్ అరెస్ట్ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి డబ్బును సీజ్ చేయడం ఇది మొదటి సారి కావడం విశేషం. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు.. ఇలాంటి మోసాల పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ తెలిపారు.

Next Story