అర్ధరాత్రి స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

by Disha Web Desk 12 |
అర్ధరాత్రి స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, బహదూర్ పురా : ఎండల తీవ్రతకు తోడు నిత్యం జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో జనం బెంబేలెత్తుతున్నారు. తాజాగా బహదూర్ పురా కిషన్ బాగ్‌లోని ఆటో గ్యాస్ పెట్రోల్ పంప్ సమీపంలో స్క్రాప్ గోదాంలో అగ్నిప్రమాదం రాత్రి ఒంటిగంట సమయంలో జరిగింది. లారీలు, ట్రాన్స్పోర్ట్ వాహనాల విడిభాగాలను ఈ గోదాంలో స్క్రాప్ చేస్తుంటారు. ఆయిల్ డీజిల్ తో ఉన్న విడిభాగాల కారణంగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడ్డాయి. పక్కనే ఉన్న లారీలు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.

అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న బహదూర్ పురా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కిషన్ బాగ్ కార్పొరేటర్ హుస్సేనీ పాషా కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అర్ధరాత్రి సమయం కావడంతో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story