ఉపరితల ఆవర్తనం.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

by Naga Rani Yarlagadda |

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఉపరితల ఆవర్తనం.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వాతావరణ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. పగలంతా మాడు పగిలే ఎండ కాస్తుండగా.. సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతోంది. కొన్నిప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వర్షసూచన ఉన్న ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండకపోవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. శనివారం నిజామాబాద్ లో 42.4, ఆదిలాబాద్ లో 42.3, నల్లగొండలో 41, మెదక్ లో 40.6, హకీంపేట్ లో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం విజయవాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పలుప్రాంతాల్లో హదారులపై నీరు నిలవగా.. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.

Next Story