ఫిన్లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం.. బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా

by Ramesh Naini |

హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన బీటెక్ విద్యార్థి ముత్యంరెడ్డి మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్‌లో గత 45 రోజులుగా కనిపించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఫిన్లాండ్‌లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం.. బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన బీటెక్ విద్యార్థి ముత్యంరెడ్డి మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్‌లో గత 45 రోజులుగా కనిపించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్‌కు వెళ్లిన మణిదీప్ గత నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్, సందేశాలకు స్పందించడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థి ఆచూకీ లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ, బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

స్థానిక అధికారులు స్పందించకపోవడంతో మణిదీప్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై కేంద్ర ప్రభుత్వం, ఫిన్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులకు వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మణిదీప్‌ను సురక్షితంగా గుర్తించేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని కేటీఆర్ కోరారు.

Next Story