హైదరాబాద్ ఆర్టీసీ కళా భవన్‌ సీజ్.. TSRTC కీలక నిర్ణయం

by Disha Web Desk 19 |
హైదరాబాద్ ఆర్టీసీ కళా భవన్‌ సీజ్.. TSRTC కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా భవన్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సీజ్‌ చేసింది. సుచిరిండియా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌తో అద్దె కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ సంస్థ 2016లో టీఎస్‌ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ కళాభవన్‌ను అద్దెకు తీసుకుంది. ఆ భవన్‌లో కల్యాణమండపం, కళా భవన్‌, మరో మూడు మినిహాళ్లు లీజ్‌కు తీసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం నెలకు రూ.25.16 లక్షలను టీఎస్‌ఆర్టీసీకి సుచిరిండియా హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ చెల్లించాలి. కానీ, గత కొంత కాలంగా సుచిరిండియా సంస్థ అద్దె సకాలంలో చెల్లించక పోవడంతో రూ.6.55 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

పెండింగ్‌ బకాయిలను చెల్లించాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు పలుమార్లు సుచిరిండియాకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారి నుంచి తగిన స్పందన రాలేదు. ఒప్పందం ప్రకారం ప్రతి నెల అద్దె చెల్లించకుంటే నోటీసులు జారీ చేసి.. ఆర్టీసీ కళాభవన్‌ను టీఎస్‌ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. నోటీసులకు సుచిరిండియా సంస్థ స్పందించకపోవడంతో.. కళాభవన్‌ను టీఎస్‌ఆర్టీసీ అధికారులు తాజాగా సీజ్ చేశారు. సుచిరిండియా కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. ''సుచిరిండియా సంస్థ ఒప్పందం ప్రకారం టీఎస్‌ఆర్టీసీకి అద్దె చెల్లించడం లేదు. కాంట్రాక్టును రద్దు చేసి ఆర్టీసీ కళా భవన్‌ను సీజ్‌ చేస్తున్నాం." అని ఆర్టీసీ కళాభవన్‌ ఎంట్రన్స్‌లో ఒక పత్రాన్ని అధికారులు అతికించారు.

Next Story

Most Viewed