‘ముక్కు మొహం తెలియని వారితో ఛాటింగ్ చేస్తున్నారా?’.. అయితే ఈ వార్త మీకోసమే!

by Gantepaka Srikanth |

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ సౌకర్యంతో పాటు ఎంతోమంది యువతుల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.

‘ముక్కు మొహం తెలియని వారితో ఛాటింగ్ చేస్తున్నారా?’.. అయితే ఈ వార్త మీకోసమే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ సౌకర్యంతో పాటు ఎంతోమంది యువతుల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న సైబర్ వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ ఘటనలపై ఆయన స్పందిస్తూ అమ్మాయిలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


సైబర్ నేరగాళ్ల మాయాజాలం..

అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను డిస్‌ప్లే పిక్చర్స్ (DP)గా పెట్టుకుని సైబర్ నేరగాళ్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతారని, వారి మాయమాటలు నమ్మి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంచుకోవద్దని హెచ్చరించారు. ఒకసారి ఫోటోలు పంపగానే నేరగాళ్లు రాక్షసులుగా మారి, వాటిని మార్ఫింగ్ చేసి డబ్బుల కోసం లేదా భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు తన దృష్టికి వచ్చాయని సీపీ తెలిపారు.

తల్లిదండ్రులకు సూచన..

పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశంపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలని, వారితో సమయం గడుపుతూ భరోసా ఇవ్వాలని సూచించారు. వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకోవడం లేదా మానసిక క్షోభ అనుభవించడం సరైనది కాదని సజ్జనార్ పేర్కొన్నారు. సమస్య ఎదురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులకు లేదా నమ్మకమైన స్నేహితులకు చెప్పండి. ఏమాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేయండి లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండని సజ్జనార్ సూచించారు. "ఫేక్ ప్రొఫైల్స్, వీపీఎన్ (VPN)లు వాడితే పోలీసులకు చిక్కమని ఎవరైనా భ్రమపడితే అది పొరపాటే. మీరు ఎక్కడ దాక్కున్నా సరే సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం" అని నేరగాళ్లను సీపీ హెచ్చరించారు.

Next Story