సీఎం కేసీఆర్ ఒక బట్టేబాజ్: Hussain Nayak ఘాటు విమర్శలు

by Disha Web Desk 19 |
సీఎం కేసీఆర్ ఒక బట్టేబాజ్: Hussain Nayak ఘాటు విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక బట్టేబాజ్ అని ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన మహిళపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఫైరయ్యారు. పోలీసులు మద్యం తాగి ఉన్నారని ఆయన ఆరోపించారు. దాదాపు 2 గంటల పాటు ఆమెను వాహనంలో తిప్పి, దాడి చేసి ఇంటి వద్ద పడేశారని ధ్వజమెత్తారు. పెట్రోలింగ్ నిర్వహించాల్సిన సమయంలో పోలీసులు కూడా పెట్రోల్(లిక్కర్) తాగి ఇలా చేయడం సిగ్గుచేటని, రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

ఇది ఫ్రెండ్లీ పొలీసింగా అని హుస్సేన్ నాయక్ నిలదీశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని బాధిత మహిళకు కబురు చేసిందని, ఎన్నో ఏండ్ల క్రితం కట్టిన ఇండ్లనే ఇప్పటిక వరకు లబ్ధిదారులకు కేటాయించని ప్రభుత్వం బాధిత మహిళకు ఇల్లు ఇస్తుందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో హోం శాఖ మంత్రి ఉన్నారా? అని ఉంటే ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి చనిపోయినా బీఆర్ఎస్ నేతలు వెళ్లరని, ఇక గిరిజన నేతలు, గిరిజన మంత్రి, దొర పేరు టాటూ వేసుకున్న మంత్రి సత్యవతి ఈ అంశంపై స్పందించలేదని, ఆమె ఎక్కడ పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆమె ఎందుకు నోరు మెదపడం లేదని ఫైరయ్యారు. గిరిజనులు దొరకు బానిసలుగా బతకాలా? అని విరుచుకుపడ్డారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు బేవకూఫ్‌గా వ్యవహరించారని, నిందితులను సస్పెండ్ చేయడం కాదు.. శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు. గత పాలకుల హయాంలో ఇంత అన్యాయం జరగలేదని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ తదితరులు ఉన్నారు.

Next Story