సాంకేతికతకు మానవుడే యజమాని కావాలి: మోహన్ భగవత్ ఆకాంక్ష

by Malleboina Mahesh |

హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతి వనంలో జరిగిన ఈ 7వ అంతర్జాతీయ శిబిరానికి 79 దేశాల నుండి ప్రతినిధులతో పాటు మోహన్ భగవత్ హాజరయ్యారు.

సాంకేతికతకు మానవుడే యజమాని కావాలి: మోహన్ భగవత్ ఆకాంక్ష
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ శివార్లలోని కన్హా శాంతి వనంలో జరిగిన ఈ 7వ అంతర్జాతీయ శిబిరానికి 79 దేశాల నుండి ప్రతినిధులతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) హాజరయ్యారు. ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించే 'విశ్వగురువు‌గా భారతదేశం మళ్ళీ ఎదగడం అనేది మన వ్యక్తిగత ఆశయం మాత్రమే కాదని, అది ప్రస్తుత ప్రపంచ అవసరమని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి సంఘ్ వంటి అనేక సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని, వ్యక్తిత్వ వికాసం ద్వారా సమాజంలో మార్పు తీసుకువచ్చే వ్యక్తులను సంఘ్ సిద్ధం చేస్తోందని ఆయన వివరించారు. సమాజంలో మంచి మార్పును తీసుకురావడానికి, క్రమశిక్షణతో కూడిన హార్డ్ వర్క్ అవసరమని, దీనిని మన చర్యల ద్వారా నిరూపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి స్పందిస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సోషల్ మీడియా వంటి ఆధునిక సాధనాలు మానవాళిపై యజమానిగా మారకూడదని ఈ సందర్భంగా భగవత్ స్పష్టం చేశారు. సాంకేతికత వల్ల ప్రతికూల ఫలితాలు రాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని, మానవ మేధస్సు ఎప్పుడూ సాంకేతికతను లోక కల్యాణం వైపు, అంటే 'దైవిక ప్రవృత్తి' వైపు నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మంతో (సృష్టిని నడిపించే సూత్రం) అనుసంధానించినప్పుడే సమతుల్య అభివృద్ధి సాధ్యమవుతుందని, దీనిని మనం జీవించి చూపాలని ఆయన ఉద్ఘాటించారు.

Next Story