ఇలాంటి సచివాలయం కట్టించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యం: హోంమంత్రి మహమూద్​ అలీ

by Disha Web Desk 19 |
ఇలాంటి సచివాలయం కట్టించడం ఒక్క కేసీఆర్‌కే సాధ్యం: హోంమంత్రి మహమూద్​ అలీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నూతనంగా నిర్మించిన డాక్టర్​బీ.ఆర్.అంబేద్కర్​సచివాలయ భవనం లాంటిది దేశంలోనే లేదని హోం మంత్రి మహమూద్​అలీ అన్నారు. ఇలాంటి సచివాలయాన్ని కట్టించటం ఒక్క కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. హోం మంత్రి మహమూద్​అలీ శుక్రవారం కొత్తగా నిర్మించిన సచివాలయ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టం ఏర్పడిన కొన్ని సంవత్సరాల్లోనే అద్భుతమైన పాలనను కేసీఆర్​అందించారన్నారు. ప్రజల భద్రత కోసం పోలీస్​కమాండ్​కంట్రోల్, పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కొత్తగా నిర్మించారన్నారు.

అధునాతన పద్దతిలో నిర్మించిన సచివాలయంతో అందరు మంత్రులు, అన్ని కార్యాలయాల ఉన్నతాధికారులు ఒకే చోట కలిసి పని చేసే వెసులుబాటు కలిగిందని చెప్పారు. హోంమంత్రితో పాటు ఉన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​కుమార్​మాట్లాడుతూ.. కొత్త సచివాలయ భవనం కేసీఆర్​చిత్తశుద్ధి, అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు. ఇక, నాగార్జునసాగర్​ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ రవీందర్​రావు, టీఎన్జీఓ హైదరాబాద్​జిల్లా అధ్యక్షుడు ముజీబ్​తదితరులు హోంమంత్రితో పాటు ఉన్నారు.

Next Story

Most Viewed