హోంగార్డు కుటుంబానికి చేయూత.. రూ. 34 లక్షల బీమా అందజేత

by Ramesh Naini |

విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలుస్తూ పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా బీమా పరిహారాన్ని అందజేశాయి.

హోంగార్డు కుటుంబానికి చేయూత.. రూ. 34 లక్షల బీమా అందజేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలుస్తూ పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా బీమా పరిహారాన్ని అందజేశాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో హోం గార్డుగా విధులు నిర్వహించిన ఎం. వెంకటేష్ గత ఏడాది ఏప్రిల్ 27న జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డు విభాగంతో యాక్సిస్ బ్యాంక్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, వేతనం అకౌంట్ కలిగిన సిబ్బందికి వర్తించే ప్రమాద బీమా సౌకర్యం కింద రూ. 34 లక్షల పరిహారం మంజూరైంది.

అడిషనల్ డీజీపీ (హోంగార్డు) స్వాతి లక్రా చేతుల మీదుగా ఈ చెక్కును మృతుడి భార్య కొడిగంటి స్వాతికి డీజీపీ కార్యాలయంలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి పోలీసు శాఖ తరపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో బాధిత కుటుంబానికి సకాలంలో ఆర్థిక సాయం అందించిన యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, బ్యాంక్ ప్రతినిధులు, హోంగార్డు రీజియన్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, ఏవో సాయి కుమార్ పాల్గొన్నారు.

Next Story