పాత బస్తీకి మెట్రో రైలు.. సన్నాహక పనులు ప్రారంభించిన హెచ్ఎంఆర్ఎల్

by Dishafeatures2 |
పాత బస్తీకి మెట్రో రైలు.. సన్నాహక పనులు ప్రారంభించిన హెచ్ఎంఆర్ఎల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాతబస్తీలో మెట్రో రైలు పనులు చేపట్టేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ సన్నాహక పనులను ప్రారంభించింది. పాత నగరంలో 5.5 కిలోమీటర్లు బ్యాలెన్స్ మెట్రో అలైన్‌మెంట్ ఎంజీబీఎస్ నుండి దారుల్షిఫా జంక్షన్ - పురానీ హవేలీ - ఇత్తెబార్ చౌక్ - అలీజాకోట్ల - మీర్ మోమిన్ దైరా - హరిబౌలి - శాలిబండ - శంషీర్‌గంజ్, అలియాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు ఉంటుంది. ఈ మెట్రో రైల్ మార్గంలో 5 స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం మీడియాకు తెలిపారు. సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్‌గంజ్, ఫలక్‌నుమా స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మెట్రో స్టేషన్లు సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌లకు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్‌లకు నగరంలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వాటి పేరు పెట్టామన్నారు. విస్తరణలో ఎఫెక్ట్ అయ్యే దాదాపు 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్‌ల తయారీ ప్రారంభించబడిందని, ఒక నెలరోజుల లో భూ సేకరణ నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

పాతబస్తీలో మెట్రో రైల్ మార్గంలో 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 స్మశానవాటికలు, 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయని తెలిపారు. కర్వేచర్ సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ లొకేషన్‌లలో తగిన మార్పు మొదలైన ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా, నాలుగు తప్ప మిగిలిన అన్ని మతపరమైన, సున్నితమైన నిర్మాణాలు పరిరక్షించబడ్డాయన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మిగిలిన ఆ నాలుగు మతపరమైన నిర్మాణాలను కూడా కాపాడేందుకు మెట్రో అలైన్‌మెంట్‌కు ఇంజినీరింగ్ పరిష్కారాలు ప్రారంభించామన్నారు. మతపరమైన నిర్మాణాలను కాపాడేందుకు, రోడ్డు విస్తరణ 80 అడుగులకు పరిమితం చేయడం జరుగుతుందని, కానీ నగరంలోని మిగిలిన ప్రాంతాల్లో మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా స్టేషన్ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరించడం జరుగుతుందని తెలిపారు.


Next Story