హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఉహించని షాక్.. భారీ జరిమానా విధించిన హైకోర్టు

by Malleboina Mahesh |

కోర్టు ఆదేశించినా కౌంటర్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఉహించని షాక్.. భారీ జరిమానా విధించిన హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఊహించని షాక్ ఇచ్చింది. ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. రూ 50 వేల జరిమానా విధించింది. నగర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలుస్తున్న హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఒక కేసు విచారణకు సంబంధించి కోర్టు ఆదేశించినప్పటికీ సకాలంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, కమిషనర్ రంగనాథ్‌ (Hydra Commissioner Ranganath)కు రూ. 50,000 (యాభై వేల రూపాయలు) జరిమానా (కాస్ట్) విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

సీజే రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశాలు..

కోర్టుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, సమాధానం ఇవ్వడానికి పదే పదే గడువు తీసుకోవడం, కాలయాపన చేయడం సరికాదని న్యాయస్థానం ఈ సందర్భంగా మండిపడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రంగనాథ్‌కు విధించిన ఈ జరిమానా మొత్తాన్ని తక్షణమే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJ) రిలీఫ్ ఫండ్‌కి జమ చేయాలని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విభాగాల ఆలస్యంపై కోర్టు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వర్గాల్లో , రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story