మేడారం వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. ఈ సారి ఆకాశమార్గంలో వెళ్లే ఛాన్స్

by Disha Web Desk 2 |
మేడారం వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. ఈ సారి ఆకాశమార్గంలో వెళ్లే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహా జాతరను ప్రతిష్టాత్మకంగా జరుపుతోంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈనెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవోపేతంగా ప్రారంభం కానుంది. దీనికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తాజాగా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ సారి హెలికాప్టర్ సేవలు అందించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే హన్మకొండ నుంచి మేడారం హెలికాప్టర్‌‍లో వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శన సదుపాయం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగుపయనం కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణంతో ఆస్వాదించవచ్చు. గతంలో సేవలందించిన ప్రైవేటు సంస్థతోనే ఈసారి కూడా అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధరల వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed