గర్భిణీలు పసిపిల్లల ఆరోగ్యం సర్కారు బాధ్యత : ఇంద్రకరణ్ రెడ్డి

by Disha Web Desk 4 |
గర్భిణీలు పసిపిల్లల ఆరోగ్యం సర్కారు బాధ్యత : ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : గర్భిణీల్లో రక్తహీనతతో పాటు పౌష్టికాహార లోపాలను అరికట్టేందుకు ప్రభుత్వం "కేసీఆర్ న్యూట్రిషన్ కిట్​" కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అట‌వీ, పర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర‌ణ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తల్లీబిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందించ‌డంతో పాటు మాతా, శిశు మరణాల నివారణ కోసం తమ ప్రభుత్వం కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను ప్రవేశపెట్టిందన్నారు.


బిడ్డ సంరక్షణ కోసం ఇప్పటికే కేసీఆర్ కిట్ ప‌థ‌కం అమ‌లు చేస్తున్న ప్రభుత్వం, తల్లి సంరక్షణ కోసం ఇప్పుడు కేసీఆర్‌ న్యూట్రీషన్ కిట్ ప‌థ‌కం ప్రవేశ పెట్టింద‌ని తెలిపారు. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్‌ కిట్ ఎంత‌గానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రక్త హీనత న‌మోద‌వుతున్న 9 జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లా ఒక‌ట‌ని, కొత్తగా అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ ప‌థ‌కం వ‌ల్ల గర్బిణులకు వరంగా మారనుంద‌ని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నదని వెల్లడించారు. కార్యక్రమంలో జ‌డ్పీ చైర్మన్ రాథోడ్ జ‌నార్ధన్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, క‌లెక్టర్ సిక్తా ప‌ట్నాయ‌క్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed