పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నడు.. హరీశ్ రావుకు సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-04 11:15:02  IST  )

హరీశ్ రావు (Harish Rao)కు ఓ అరుదైన వ్యాధి ఉందని.. తమకు తామే గొప్ప అని ఊహించుకుంటారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) కామెంట్ చేశారు.

పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నడు.. హరీశ్ రావుకు సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: హరీశ్ రావు (Harish Rao)కు ఓ అరుదైన వ్యాధి ఉందని.. తమకు తామే గొప్ప అని ఊహించుకుంటారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) కామెంట్ చేశారు. ఇవాళ కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన హరీశ్ రావు రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యాఖ్యలకు రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలను నిస్సంకోచంగా, నిసిగ్గుగా మాట్లాడటం హరీశ్ రావుకే చెల్లిందన్నారు. ఆయనకు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధి ఉందంటూ సెటైర్లు వేశారు. అవతలి వ్యక్తులు చేసే ప్రతి పనినీ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. ఏదైనా మంచి జరిగితే అది తమ ఖాతాలో వేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నని ఫైర్ అయ్యారు. ఓ వైపు టిమ్స్ (TIMS) ఆసుపత్రులను అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ప్రభుత్వం ఉంటే.. పబ్లిసిటీ కోసం హరీశ్‌రావు పాకులాడుతున్నాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ (Hyderabad) నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు కడతామని కేసీఆర్ చెప్పారని.. 2020లో కరోనా టైమ్‌లో ఆరోగ్య శాఖతో పాటు ఆసుపత్రులను పాపాన పోలేదని రామ్మోహన్ ధ్వజమెత్తారు.

గచ్చిబౌలి (Gachibowli) స్టేడియానికి సంబంధించిన ఓ భవనానికి టిమ్స్ అని బోర్డు తగిలించారంటూ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. నాలుగు టిమ్స్‌లలో ఒక టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామంటూ జబ్బలు చరుచుకున్నారని ఎద్దేవా చేశారు. కోవిడ్ తగ్గగానే గచ్చిబౌలి టిమ్స్ మూత పడేశారని అన్నారు. మిగిలిన 3 టిమ్స్‌ల గురించి 2022 వరకూ అసలు ఊసే లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రివ్యూ చేసి పనులను కొనసాగించాలని ఆదేశించారని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రాజెక్టుల అంచనాల పెంపు అక్రమాలపై విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి సనత్‌నగర్ (Sanath Nagar) టిమ్స్‌‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఓ వైపు అత్యాధునిక వసతులతో టి‌మ్స్‌లను తీర్చిదిద్దే పనిలో తమ ప్రభుత్వం ఉంటే.. హరీశ్‌రావు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎల్బీ నగర్‌ (LB Nagar)కు వెళ్లి ఏదో షో‌ చేసి.. నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. ఇక దశాబ్దాల ఉస్మానియా హాస్పిటల్‌ కలను తాము నెరవేరుస్తుంటే ఆయన చూసి తట్టుకోలేకపోతున్నాడని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు.

Next Story