HCU VS TG GOVT: తెలంగాణ సర్కార్ ప్రకటనను ఖండించిన హెచ్ సీయూ.. యూనివర్సిటీ భూముల విషయంలో సంచలన ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-03-31 11:44:43  IST  )

గచ్చిబౌలి భూములపై హెచ్ సీయూ కీలక ప్రకటన చేసింది.

HCU VS TG GOVT: తెలంగాణ సర్కార్ ప్రకటనను ఖండించిన హెచ్ సీయూ.. యూనివర్సిటీ భూముల విషయంలో సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: హెచ్ సీయూ (HCU) భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీజీఐఐసీకి కేటాయించిన స్థలం యాజమాన్యం, యూనివర్సిటీ భూముల హద్దుల నిర్ధారణ విషయంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఖండించింది. 400 ఎకరాల భూమిని గుర్తించేందుకు యూనివర్సిటీ క్యాంపస్ లో రెవెన్యూ అధికారులు జూలై 2024లో ఎలాంటి సర్వే నిర్వహించలేదని తాజాగా హెచ్ సీయూ రిజిస్ట్రార్ (HCU Registrar) ప్రెస్ నోట్ విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై (Gachibowli Lands) యాజమాన్యం తమదేనని కోర్టులో సాధించిన విజయంతో ఆ భూములు ప్రభుత్వ పరం అయ్యాయని రాష్ట్ర సర్కార్ (Telangana GOVT) ఇవాళ ప్రకటనచేసింది. సర్వే నిర్వహణ విషయంలో టీజీ ఐసీసీ జోనల్ మేనేజర్ 2024 జులై 18న యునివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ కు [email protected] కు మెయిల్ చేశారని, హెచ్ సీయూ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024 జూలై 19న యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజినీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే నిర్వహించి అదే రోజున హద్దులు నిర్ధారించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనను తాజాగా హెచ్ సీయూ రిజిస్ట్రార్ తోసిపుచ్చారు.

ఇప్పటి వరకు కేవలం భూమి ప్రాథమిక పరిశీలన మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ఇటీవల పత్రికల్లో వచ్చిన టీజీఐఐసీ (TG IIC) ప్రకటనను కూడా యూనివర్సిటీ ఖండించినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీకి కేటాయించిన భూమి ఏదైనా బదిలీ జరగాలంటే అది యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి అధికారిక సమ్మతితోనే జరుగుతుంది. ఈ విషయంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ స్టేక్ హోల్డర్స్, మీడియా ప్రతినిధులు యూనివర్సిటీ ధృవీకరించని ఏ సమాచారన్ని వ్యాప్తి చేయండం, ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఓ వైపు ప్రతిపక్షాలు ఈ భూముల విషయంలో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ తాము చేసిన ప్రకటనపై హెచ్ సీయూ నుంచి వ్యతిరేకత రావడం రేవంత్ సర్కార్ ను డిఫెన్స్ లోకి నెట్టిినట్లైంది. మరి యూనివర్సిటీ ప్రకటనపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.

Next Story