వరంగల్‌లో క్రికెట్ స్టేడియం.. వచ్చే ఏడాది నుంచే మ్యాచ్‌లు: హెచ్‌సీఏ అధ్యక్షుడు

by Dishanational5 |
వరంగల్‌లో క్రికెట్ స్టేడియం.. వచ్చే ఏడాది నుంచే మ్యాచ్‌లు: హెచ్‌సీఏ అధ్యక్షుడు
X

దిశ, వరంగల్: హైదరాబాద్‌తోపాటు వరంగల్‌ జిల్లాలోనూ క్రికెట్‌ను అభివృద్ధి చేస్తానని ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్’(హెచ్‌సీఏ) అధ్యక్షుడు, జాతీయ హైండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.జగన్ మోహన్ రావు తెలిపారు. హన్మకొండలోని ల్యాండ్ మార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో జగన్ మోహన్ రావును వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్, హైండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సన్మానించారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ మాట్లాడుతూ, చదువు, ఆటల పరంగా తాను వరంగల్ నుంచే స్ఫూర్తి పొందానని తెలిపారు. త్వరలోనే వరంగల్ క్రికెట్ క్లబ్ ఏర్పాటుచేస్తానని చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ నుండి సమ్మర్ క్యాంపులు నిర్వహించి మంచి ఆటగాళ్లను ఎంపికచేసి హైదరాబాద్‌లో శిక్షణ అందిస్తామని వెల్లడించారు. జిల్లాలో క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తామని, వచ్చే ఏడాది నుండి రంజీ మ్యాచ్‌లు కూడా నిర్వహించే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ అలియాస్ మార్షల్ శీను, హైండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇండ్ల నాగేశ్వర్ రావు, అర్జున అవార్డు గ్రహీత నాగపురి సారంగపాణి, బొద్ధిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed