BRS అటెన్షన్ డైవర్ట్ ప్లాన్ రివర్స్ అయిందా?

by Disha Web Desk 4 |
BRS అటెన్షన్ డైవర్ట్ ప్లాన్ రివర్స్ అయిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్ లైన్‌తో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసింది. ఆ సమయంలో అప్పటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ ఈ నినాదాన్ని ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అవ్వడం దరిమిలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంతో పాటు ఉద్యమ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఆ పార్టీపై అన్ని వర్గాల్లో ఆనాడు నమ్మకం కుదిరింది. యువత సైతం తెలంగాణ ఉద్యమాన్ని భూజానికెత్తుకున్ని తమకు ఉద్యోగాలు వస్తాయని పోరాటం సాగించారు. కానీ తొలి దఫా ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు షాక్ ఇచ్చింది.

నియామకాల్లో తీవ్ర జాప్యం కారణంగా యువకుల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టిన సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రావడానికి సాధ్యసాధ్యాలను పక్కనబెట్టి నిరుద్యోగ భృతి రూ.3016 ఇస్తామనే హామీని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో యువకులు పెద్ద ఎత్తున ఈ స్కీంకు అప్లై చేసుకున్నారు. తెలంగాణ ఎంప్లాయిస్ ఎక్స్ఛేంజీలో మొత్తం 10లక్షల మంది, టీఎస్పీఎస్సీలో 30 లక్షల మంది వరకు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారంటే తెలంగాణలో నిరుద్యోగం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరు మాత్రమే కాకుండా చాలా మంది వయసు దాటి పోవడంతో ఉద్యోగాల ఆశ వదులుకున్నారు.

ప్రైవేట్ జాబ్‌లు, బిజినెస్‌లు, గల్ఫ్ బాట పట్టారు. ఇక తాజా బడ్జెట్‌లో సైతం ఆర్థిక మాంద్యం సాకుగా ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడింది. అయితే నిరుద్యోగ భృతి స్థానంలో ఉద్యోగాల భర్తీ అంశాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చి ఎన్నికల వేళ యువతను డైవర్ట్ చేసే స్కెచ్ వేసింది. నిరుద్యోగ యువత పరీక్షలపై ఫోకస్ పెట్టాలని.. తద్వారా ఎలక్షన్స్‌లో తమకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదని బీఆర్ఎస్ భావించింది.

అధికార పార్టీ నేతల్లో టెన్షన్.. టెన్షన్

అయితే తాజాగా TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెరపైకి రావడంతో నిరుద్యోగ యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఆరు నెలల్లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్‌మెంట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. నిరుద్యోగులంతా పరీక్షలకు సన్నద్ధమైతే తమకు ఎలాంటి నష్టం వాటిల్లదని భావించిన గులాబీ బాస్‌కు TSPSC వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది. గతేడాది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ 91,142 ఉద్యోగాలను నోటిఫై చేసిన్నట్లు వాటి నియామకానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రకటించారు.

సీఎం ప్రకటన జారీతో అధికారులు హుటాహుటిన ఆయా శాఖల వారీగా ఖాళీల జాబితాను ప్రకటించాయి. అయితే నిరుద్యోగుల్లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఉన్న వ్యతిరేకతను గ్రహించే కేసీఆర్ ప్రకటన చేశారని ప్రతిపక్షాలు ఆ సందర్భంగా ఆరోపించాయి. ఎన్నికల స్టంట్ మాత్రమే అని ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. అయితే తాజా టీఎస్పీఎస్సీ వివాదంతో నియామక ప్రక్రియకు బ్రేక్ పడటంతో బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఎన్నికల వేళ లీకేజీ వ్యవహారం ఫలితాలపై ఎఫెక్ట్ చూపుతుందని భావించిన కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అటు లిక్కర్ స్కాంలో కవిత పేరు వినిపించడం, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో సొంత పార్టీ నేతల్లో గుబులు మొదలైంది.

సీఎం సైలెంట్ అందుకేనా..

ఇద్దరు వ్యక్తుల తప్పుగా ఇటీవల టీఎస్పీఎస్సీ అంశాన్ని మంత్రి కేటీఆర్ ముడిపెట్టారు. ప్రభుత్వ పనితీరుపై మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు లీకేజీకి పాల్పడేంత వీక్‌గా మన సిస్టం ఉందా అని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఏ అంశంపైన అయినా విలేకరుల సమావేశం పెట్టి గంటల తరబడి ఎండగట్టే కేసీఆర్ ఈ అంశంపై స్పందికపోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

నిరుద్యోగులు వారిపై ఆధారపడిన కుటుంబాల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉన్న సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టకపోవడం కొసమెరుపు. అయితే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశం కావడంతో సీఎం ఈ అంశంపై సమీక్ష నిర్వహించారే తప్ప ఎలాంటి కామెంట్ చేయలేదని టాక్ నడుస్తోంది. కవిత లిక్కర్ స్కాం విషయంలో ఎప్పటికప్పుడు స్పందిస్తున్న మంత్రులు లీకేజీ అంశంపై మాత్రం కిమ్మనకపోవడం విశేషం. మరి TSPSC వ్యవహారం రానున్న ఎన్నికల ఫలితాల్లో ఏ మేరకు ప్రభావం చూపనుంది. నిరుద్యోగులు ఈ సారి బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Read More:

కేసీఆర్ బీ కేర్ ఫుల్.. పంచాగ పఠనంలో ఆసక్తికర విషయాలు వెల్లడి



Next Story

Most Viewed