రూల్స్ అతిక్రమించి కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు: సెబీకి హరీశ్‌రావు ఫిర్యాదు

by Gantepaka Srikanth |

వాస్తవాలు దాచి పెట్టి, నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు సమీకరించిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

రూల్స్ అతిక్రమించి కంచ గచ్చిబౌలి భూముల తాకట్టు: సెబీకి హరీశ్‌రావు ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వాస్తవాలు దాచి పెట్టి, నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు సమీకరించిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. కంచెగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ చైర్మన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు టీజీఐఐసీ ద్వారా తీసుకున్న ప్రభుత్వ ఆర్థిక అవకతవకలను ఎండగట్టారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ ఈ భూమిని అటవీ భూమిగా గుర్తించిందని, అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. టీజీఐఐసీ వార్షిక ఆదాయం రూ.150 కోట్లు కన్నా తక్కువే అయినా వేల కోట్ల అప్పులు తీసుకోవడం ఆర్థిక అవకతవకలకు పాల్పడటంలో భాగమేనని పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శకత లేదని.. సెబీ నియమ నిబంధనలు పాటించారన్న విషయంలోనూ స్పష్టత లేదని ఆరోపించారు. రుణ సేకరణ కోసం మధ్యవర్తులకు రూ.169.83 కోట్లు బ్రోకరేజ్ చెల్లించారని పేర్కొన్నారు. రాష్ట్ర అటవీ సంపదను తాకట్టు పెట్టి, అడ్డదారుల్లో రుణాలు సేకరించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆర్థిక అవకతవకలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

Next Story