హరీష్ రావుVs మైనంపల్లి.. మెదక్‌లో వార్ స్టార్ట్!

by Disha Web Desk 4 |
హరీష్ రావుVs మైనంపల్లి.. మెదక్‌లో వార్ స్టార్ట్!
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ నియోజకవర్గం బరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది.. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బరిలో నిలుస్తుండగా కాంగ్రెస్ నుంచి మైనం పల్లి రోహిత్ దాదాపు ఖరారైంది. పోటీ ఇద్దరి మధ్యే ఉన్నా.. వెనకాల ఉండి నడిపిస్తుంది మాత్రం ఆ... ఇద్దరే. అందులో ఒకరు రాష్ట్ర మంత్రి హరీశ్​రావు అయితే.. మరొకరు మైనం పల్లి హన్మంతరావు.. పోటీలో ఉన్న వారి కంటే.. వెనకాల ఉండి నడిపిస్తున్న వారిపైనే అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే పరోక్షంగా పేరు పెట్టకుండా ఆ ఇద్దరూ ఘాటు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.. మున్ముందు వారి మధ్య పోరు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టంగా మారుతోంది. మెదక్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బరిలో ఉంటున్న విషయం తెలిసిందే..

ఇక కాంగ్రెస్ నుంచి మైనం పల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.. దాదాపు వీరిద్దరి మద్య ఎన్నిక పోటీ ఉండే అవకాశం ఉంది.. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. అయితే మైనం పల్లి హన్మంతరావు, పద్మా దేవేందర్ రెడ్డిల మధ్య దాదాపు 20 యేళ్లుగా రాజకీయ వైరం ఉంది.. గతంలో మైనం పల్లి, పద్మా దేవేందర్ రెడ్డిల మధ్య మూడు సార్లు పోటీ పడ్డారు.. ఈ సారి కాంగ్రెస్ నుంచి రోహిత్ వస్తుండడం తో పద్మ, రోహిత్‌ల మధ్య గట్టి పోటీ ఉంటుందన్న ప్రచారం సాగుతుంది.. కానీ పోటీలో ఇద్దరు ఉంటున్న వెనకాల నడిపిస్తుంది మాత్రం ఆ ఇద్దరే.. అందులో ఒకరు రాష్ట్ర మంత్రి హరీష్ రావు, మరొకరు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. మెదక్ నియోజక వర్గంలో వీరి పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మైనంపల్లి హన్మంతరావు రాష్ట్ర మంత్రి హరీష్ రావును ఘాటుగా విమర్శించడమే.. కుమారుడికి బీఅర్‌ఎస్ టికెట్ రాకుండా అడ్డుకున్నాడన్న ఉద్దేశంతో మైనంపల్లి చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి..

నువ్వా నేనా.. అన్నట్టు పాచికలు..

మెదక్ నియోజక వర్గంలో రాష్ట్రంలో కోడ్ కూయక ముందే పోరు షురూ అయింది.. కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లికి కాంగ్రెస్‌లో ఉన్న బడా నేతలను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు స్వయంగా మంత్రి రంగంలోకి దిగి పార్టీ మారే విధంగా అడుగులు వేశారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగడిన కంటా రెడ్డి తిరుపతి రెడ్డి బీఅర్ ఎస్‌లో చేర్పించి ఒక అడుగు ముందుకు వేశారు. కానీ పాపన్న పేట మండలంతో పాటు పలు మండలాల్లో కాంగ్రెస్ నుంచి పార్టీ మారకుండా అడ్డుకున్నారు. ఇంకా ఇద్దరు ప్రధాన నేతలతో చర్చలు సాగిస్తున్న రెండు పార్టీల అఫర్‌ల విషయంలో నేతలు ఆచితూచి వ్యవహరిస్తుండడంతో ఎవరు ఎటు అన్నది స్పష్టత రావడం లేదు. కానీ మంత్రి, మైనంపల్లి ఎవరికి వారుగా ఎత్తు గడలు సాగిస్తూనే ఉన్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో అధికార పార్టీలోకి కాంగ్రెస్ నేతలు వెళ్ళలేదు. ఈ విషయంలో మైనంపల్లి కొంత మేర విజయవంతం అయ్యారు.

ఒకరిపై ఒకరు ఆరోపణ అస్త్రాలు...

మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనం పల్లి నీ పేరు పెట్టకుండా టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తున్నారు.. ఇటీవల మెదక్ పర్యటనలో సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు కొంతమంది ఎన్నికల సందర్భంగా పెద్ద పెద్ద కార్లల్లో డబ్బుల సంచులతో వస్తున్నట్లు పరోక్షంగా మైనం పల్లిపై ఆరోపణలు చేశారు. మంత్రి హరీష్ రావుపై మైనంపల్లి కూడా ప్రతి ఆరోపణ చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.. కోవిడ్‌లో మేము చేసిన సేవలు ఎవరూ చేయలేదని, పారచూట్‌గా కాదు.. ఇక్కడే ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల్లో ఉంటామని వివరించారు. ఇక్కడ గెలిచిన తర్వాత ఆ మంత్రి పేరు చెబుతా అంటూ విమర్శలు చేశారు. ప్రతి ఆరోపణ వెనక మైనంపల్లి, మంత్రి ఒకరికి ఒకరు టార్గెట్ చేసి ఆరోపణ చేస్తుండటంతో అభ్యర్థులపై కంటే మంత్రి, మైనంపల్లి మధ్య యుద్ధం అన్నట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇద్దరి మధ్య గట్టి యుద్దమే ఉంటుందన్న ప్రచారం స్థానికంగా సాగుతుంది.


Next Story

Most Viewed