అదే పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పాలి: తేజస్వి సూర్యపై హరీష్ రావు సీరియస్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-16 11:06:17  IST  )

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ (BRS) పార్టీ తీవ్రంగా ఖండించింది.

అదే పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పాలి: తేజస్వి సూర్యపై హరీష్ రావు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ (BRS) పార్టీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఆవిర్భావంతో పోల్చడంపై ఆ పార్టీ ముఖ్య నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ట్వీట్ చేశారు. పార్లమెంట్ వేదికగా ఒక బాధ్యతాయుతమైన ఎంపీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. "తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం చారిత్రక తప్పిదం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరచడమే. ఇది భారత సమాఖ్య స్ఫూర్తి పట్ల బీజేపీకి ఉన్న అజ్ఞానాన్ని సూచిస్తోంది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

త్యాగాలను కించపరచొద్దు..

దశాబ్దాల పాటు సాగిన ప్రజాస్వామ్య పోరాటం, విద్యార్థులు, యువకులు మరియు అమరుల బలిదానాల ఫలితంగా తెలంగాణ సిద్ధించిందని బీఆర్‌ఎస్ గుర్తు చేశారు. భారత రాజ్యాంగ పరిధిలోనే శాంతియుత మార్గంలో పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని, రక్తసిక్తమైన విభజన (పాకిస్థాన్ ఏర్పాటు) తో పోల్చడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. 2014లో తెలంగాణ ఏర్పాటు అనేది ప్రజా ఆకాంక్షల ప్రతిరూపమని, దీనిని తక్కువ చేసి మాట్లాడటం ప్రాంతీయ ఉద్యమాలపై బీజేపీకి ఉన్న చులకన భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, గౌరవాన్ని కించపరిచిన తేజస్వి సూర్య, బీజేపీ వెంటనే తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. "రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తూ, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను సహించేది లేదు. తెలంగాణ చరిత్రను, గౌరవాన్ని కాపాడుకోవడానికి బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుంది" అని హరీష్ రావు స్పష్టం చేశారు.

తెలంగాణ ఏర్పాటును పాక్ విభజనతో పోల్చడమా?.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై నిరంజన్‌రెడ్డి ఫైర్

తేజస్వీ సూర్య తెలివిలేని వెధవ.. బీజేపీ ఎంపీపై మంత్రి పొన్నం ఫైర్

Next Story