GSR ఇన్ఫ్రా కంపెనీ దందా.. రూ.50 ల‌క్షలకు రూ.కోటి ఇస్తామని మోసం!

by Disha Web Desk 2 |
GSR ఇన్ఫ్రా కంపెనీ దందా.. రూ.50 ల‌క్షలకు రూ.కోటి ఇస్తామని మోసం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫామ్ హౌజ్, ఫామ్ ప్లాట్లు.. వందల ఎకరాల్లో ప్రకృతితో మమేకం చేస్తాం. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చునంటూ బురిడీ కొట్టిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో 200 ఎకరాల్లో గేటెడ్ మెగా ప్రాజెక్టు, అబెండలో మరో 200 ఎకరాల్లో ఏర్పాటు చేశామని ఈవీకే, జీఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ కస్టమర్లకు ఫామ్ ప్లాట్లను విక్రయించింది. అందమైన బ్రోచర్లు ముద్రించి పెట్టిన పెట్టుబడి రెండేండ్లల్లోనే రెట్టింపు అవుతుందని ప్రచారం చేశారు. లే అవుట్లు రూపొందించారు. సకల సౌకర్యాలంటూ బురిడీ కొట్టించారు. ఆ తర్వాత రూ.200 గజాల స్థలాన్ని వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్లు చేశారు. బ్రోచర్‌లో మాత్రం వెంచర్‌గా చూపిస్తున్నారు. విశాలమైన రోడ్లను, అందమైన భవంతులకు దర్శనం కల్పించారు. తీరా హక్కులు కల్పించేటప్పుడు మాత్రం ఆ రోడ్లేవీ కస్టమర్ల సొంతం కాకుండా జాగ్రత్త పడ్డారు. స్థానిక రెవెన్యూ అధికారుల సపోర్టుతో వెంచర్లుగా తీర్చిదిద్దిన ప్లాట్లను సాగు భూమిగా రిజిస్ట్రేషన్ చేయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. ఐతే బై బ్యాక్ ఆఫర్ల పేరిట రూ.కోట్లు కూడబెట్టారు. పెద్ద ఎత్తున ప్లాట్లను అమ్మేశారు. కానీ బై బ్యాక్ ఆఫర్ ప్రకారం రిటర్న్స్ మాత్రం ఇవ్వడం లేదు. దాంతో న్యాయం చేయాలంటూ కస్టమర్లు లబోదిబోమంటున్నారు.

నో రిటర్న్స్

సైబరాబాద్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈవీకే, జీఎస్ఆర్ ఇన్ఫ్రా తదితర కంపెనీలోనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఎజెంట్‌గా పని చేస్తోన్న హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఆ కంపెనీ ఎండీ జి.శ్రీనివాసరావు, శిల్పలపై కేసు నమోదు చేశారు. రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే రెండేండ్లల్లోనే రూ.కోటి వస్తుందని ఆశ పెట్టారు. సెక్యూరిటీగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ఓ ఎన్ఆర్ఐ చేత 2021 ఫిబ్రవరి 22న రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టించాను. ఐతే 2023 ఫిబ్రవరి 22 నాటికి రెండేండ్లవుతుంది. ఎన్ఆర్ఐ స్నేహితుడు ఈవీకే కంపెనీని సంప్రదించారు. ఎండీ శ్రీనివాసరావు, మార్కెటింగ్ హెడ్ శిల్పలు స్పందించడం లేదు. వాట్సాప్ మెసెజ్ లకు కూడా రిప్లై ఇవ్వడం లేదు. కాల్స్ కూడా అటెండ్ చేయడం లేదు. చాలా సార్లు ఫాలో అప్ చేశారు. చాలా రోజుల తర్వాత పోస్ట్ డేటెడ్ చెక్కులు అందజేశారు.

మూడు చెక్కులు అందించారు. అందులో సెల్ఫ్ చెక్కులుగా పేర్కొన్నారు. ఒక దానిపై రూ.23,75,000, మరో రెండింటిపై రూ.5 లక్షల వంతున రాశారు. మూడు నెలల తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. పలు మార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎండీ శ్రీనివాసరావు, శిల్పలు రూ.కోటి ఇస్తామన్నారు. ఆ తర్వాత మళ్లీ రెస్పాన్స్ ఇవ్వడం లేదు. తన కస్టమర్ కి న్యాయం చేయాలని అదే కంపెనీలో పని చేసిన ఎజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దాంతో సెక్షన్ 292, 417, 420 ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈవీకే ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, జీఎస్ఆర్ ఇన్ఫ్రా, ఇవాన్ ఫైన్ టెక్, అనుష ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, గుంటూరు గ్రీన్ పవర్ జనరేషన్, జీఎప్ఆర్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్.. తదితర కంపెనీల్లో జి.శ్రీనివాసరావు ఎండీగా, డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రీలాంచ్ ప్ర‌మోట‌ర్ ఆరంభించిన ప్రాజెక్టులో పెట్టుబ‌డి పెట్టించిన‌ ఎజెంటే పోలీసు కేసు పెట్టిన సంఘ‌ట‌న ఇది. రామ‌చంద్రాపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో కేసు నమోదైంది.

కరోనాలో పుట్టి..

క‌రోనా స‌మ‌యంలో పుట్టుకొచ్చిన ఈవీకే అనే రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలో కస్టమర్లతో ఎజెంట్లు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈవీకే కంపెనీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే.. రెండేళ్ల తర్వాత రెట్టింపు మొత్తం అంటే రూ.కోటి ఇస్తామని, సెక్యూరిటీగా 200 గజాల స్థలం రిజిస్టర్ చేస్తామని కంపెనీ ఆఫర్ ఇచ్చింది. ఎజెంట్లు కూడా బాగా పనికొస్తుందని తెలిసిన వారందరితో కట్టించారు. కానీ కస్టమర్లు 2021లో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టారు. 200 గజాల స్థలాన్ని కంపెనీ రిజిస్టర్ చేసింది. కానీ బై బ్యాక్ ఆఫర్ కింద రూ.కోటి ఇవ్వకుండా దాటవేస్తున్నారు. దాంతో కస్టమర్లు ఎజెంట్లపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. కంపెనీకి వచ్చి ఆరా తీస్తే సరిగ్గా స్పందించడం లేదు. ఈవీకే కంపెనీకి వెళ్లి రూ.కోటి గురించి అడిగితే ఈవీకే ఎండీ జి.శ్రీనివాసరావు, మార్కెటింగ్ హెడ్ శిల్పలు స్పందించట్లేదు. ఆ ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరగ్గా.. తిరగ్గా.. నాలుగు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. కస్టమర్ పేరిట రిజిస్టర్ చేసిన 200 గజాల భూమిని తిరిగి కంపెనీకి బదలాయించాలని, ఆ ప్రక్రియ పూర్తయిన మూడు నెలల తర్వాత సొమ్ము ఇస్తామనే స‌మాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కంపెనీ ఎండీ, ఇతరులను సంప్రదించడానికి చాలా రకాలుగా ప్రయత్నించినా స్పందించడం లేదని ఈవీకే కంపెనీ ఎండీ జి.శ్రీనివాసరావు (జీఎస్సార్ గ్రూప్‌), శిల్పపై తగిన చర్యలు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. అనేక మంది బాధితులు డబ్బులు ఏదో ఒక రోజు ఇస్తారని ఆశతో ఉన్నారు. కానీ ఒక్కరే ఇక లాభం లేదనుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

50 శాతం లాభం మీకే

గేటెడ్ మెగా ప్రాజెక్ట్ పేరిట నారాయణఖేడ్​లో 200 ఎకరాల్లో చేస్తున్నామని జీఎస్​ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ విస్తృతంగా ప్రచారం చేసింది. 605 గజాలకు కేవలం రూ.6 లక్షలే(ఆఫర్ ప్రైస్). 39 స్యాండల్ ఉడ్, 38 టీక్ ప్లాంట్స్ ఇస్తాం. 12 ఏండ్లల్లో రూ.80 లక్షలు మీ సొంతం. అంతా మేమే చూసుకుంటాం. ఆ 12 ఏండ్ల పాటు మేమే మెయింటెయిన్ చేస్తాం. ఐదు గుంటలు కొంటే 5 గ్రాముల బంగారమిస్తాం. 10 గుంటలు కొంటే 12 గ్రాముల బంగారమిస్తాం. ఈ ఆఫర్ అక్టోబరు 25వ తేదీ వరకే.. అంటూ జీఎస్ఆర్ ఇన్ఫ్రా మోడరన్ ఫామ్స్ 1, 2 పేరిట విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రైతుబంధు ఇస్తాం. భవిష్యత్తు కోసం ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. కస్టమర్లకు అంటగట్టిన స్థలాలకు సంబంధించిన సేల్ డీడ్స్ చెక్ చేయగా మరికొన్ని వింతలు బయటపడ్డాయి. లే అవుట్ లో పేర్కొన్న రోడ్లను సేల్ డీడ్ లో చూపించలేదు. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం మోర్గి రెవెన్యూ పరిధిలో సర్వే నం.15 ఊలో 5 గుంటలను విక్రయించారు. పాసు పుస్తకం కూడా వచ్చింది.

షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో నార్త్ , సౌత్, ఈస్ట్, వెస్ట్ .. నాలుగువైపులా కంపెనీ ఎండీ గుంటుపల్లి శ్రీనివాస రావు భూమి ఉంది. మధ్యలో ఈ ఐదు గుంటలు ఉందన్న మాట! అలాగే మునిపల్లి మండలం మేలసింగారంలో ఇదే జీఎస్​ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నుంచి ఒకాయన సర్వే నం.16లో ఎకరం స్థలం కొనుగోలు చేశారు. జూన్ 28న రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనికి రూ.3,37,365 చెల్లించినట్లు సేల్ డీడ్ లో పేర్కొన్నారు. అలాగే సరిహద్దుల్లో నలువైపులా గుంటుపల్లి శ్రీనివాసరావు భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయనకు కూడా ఎలాంటి రోడ్డు చూపించలేదు. మరొకాయన 20 గుంటలు ఏప్రిల్ లో కొనుగోలు చేశారు. ఆయనకు రూ.1,68,683 మాత్రమే తీసుకున్నారట! ఆయనకు కూడా రోడ్డు మార్గం లేదు. నలుదిక్కులా ఇతరులే ఉన్నారు. వీళ్లంతా భవిష్యత్తులో ఏ విధంగా వారి ఫామ్ ల్యాండ్ కు చేరుకుంటారో వేచి చూడాలి. ఇప్పుడేమో ఎలాంటి రిటర్న్స్ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.



Next Story

Most Viewed