గ్రూపు-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. వారం రోజుల్లో కొత్త సర్కార్ స్పష్టత?

by Disha Web Desk 2 |
గ్రూపు-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. వారం రోజుల్లో కొత్త సర్కార్ స్పష్టత?
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్ 2 రాత పరీక్ష నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నది. షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా? లేదా మరోసారి వాయిదా వేస్తారా? అని నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసిన గత ప్రభుత్వం 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు చేసుకుంది. 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష ఉంటుందని తొలుత ప్రకటించింది. అయితే వరుసగా గురుకుల, గ్రూప్ 1, 4 పరీక్షలు ఉండడంతో.. గ్రూప్ 2 వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో పరీక్షలను నవంబరు 2, 3 తేదీల్లో నిర్వహిస్తారని ప్రకటించింది. అయితే ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ కావడంతో మళ్లీ పరీక్షలను 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

టీఎస్పీఎస్సీ కసరత్తు

గ్రూప్‌-2 పరీక్షను షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. షెడ్యూల్ ప్రకారం జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. పరీక్ష కేంద్రాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2తో పాటు ఇతర నియామక పరీక్షల తాజా పరిస్థితిపై ఇప్పటికే వివరాలు తీసుకున్న రాష్ట్ర సర్కార్ త్వరలో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ సమీక్షలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

ప్రభుత్వం ప్రకటనపై ఉత్కంఠ

రాష్ట్రంలో గ్రూప్‌-1 ఉద్యోగ ప్రకటనపై కొత్త సర్కార్ నిర్ణయం కీలకంగా మారనుంది. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే గత ప్రభుత్వం 503 పోస్టులతో కూడిన గ్రూప్ 1 ప్రకటనపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుటుందోనని విషయం ఉత్కంఠగా మారింది.



Next Story

Most Viewed