అట్టహాసంగా కేబుల్​ బ్రిడ్జి ప్రారంభం

by Disha Web Desk 9 |
అట్టహాసంగా కేబుల్​ బ్రిడ్జి ప్రారంభం
X

దిశ, కరీంనగర్​ బ్యూరో/ కరీంనగర్​: కరీంనగర్ పట్టణానికి తలమానికంగా మారిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం బుధవారం సాయంత్రం అట్టహాసంగా సాగింది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధునాతన రోడ్లు, నలువైపులా అద్భుతమైన సెంట్రల్‌ లైటింగ్‌ తదితర హంగులతో కరీంనగర్‌ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. కేబుల్‌ బ్రిడ్జి, రాబోయే మానేరు రివర్‌ ఫంట్‌ అందమైన ప్రకృతి దృశ్యానికి సరికొత్త వైభవాన్ని ఇవ్వబోతుందన్నారు. మానేరు రివర్​ ఫంట్​ పనులు ఆగస్టు వరకు పూర్తి చేసి బోటింగ్​ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, కేబుల్​ బ్రిడ్జి ఓపెనింగ్​ సందర్భంగా ఏర్పాటు చేసిన డైనమిక్​ లైటింగ్​ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా వాతావరణం అనుకులించకపోవడంతో లేజర్​ షో రద్దు చేశారు. ఈ​ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు.

అభివృద్దిలో నెంబర్​ వన్​ కరీంనగర్​

తెలంగాణ వచ్చిన తరువాత తొమ్మిదేళ్లలో కరీంనగర్​ పట్టణం అభివృద్దిలో నెంబర్​ వన్​గా దూసుకుపోతుందని మంత్రి కేటీఆర్​ అన్నారు. ఇక్కడ అభివృద్ది చూస్తే ప్రతిపక్ష పార్టీలకు జల్లుమంటుందని అన్నారు. రాష్ర్టం రాకపోతే కరీంనగర్​ పట్టణం ఇంతగా అభివృద్ది జరిగేనా అని అన్నారు. మానేరు నది పుట్టిన చోటు నుంచి మంథని వద్ద గోదావరి నదిలో కలిసే వరకు 180కిలో మీటర్ల మేర సజల దృశ్యంగా మారనున్నట్లు మంత్రి తెలిపారు. మానేరు రివర్​ ఫంట్​ పనులు ఆగస్టు వరకు పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్​ అన్నారు.

Next Story

Most Viewed