TG: భూముల పరిరక్షణపై సర్కారు ఫోకస్.. లీగల్ ఫైట్‌కు సమాయత్తం!

by Gantepaka Srikanth |

దేవుడి భూములపై లీగల్ ఫైట్ చేసేందుకు సర్కారు సమాయత్తం అయింది. ఈ విషయమై రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పలుమార్లు రివ్యూ నిర్వహించారు.

TG: భూముల పరిరక్షణపై సర్కారు ఫోకస్..  లీగల్ ఫైట్‌కు సమాయత్తం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేవుడి భూములపై లీగల్ ఫైట్ చేసేందుకు సర్కారు సమాయత్తం అయింది. ఈ విషయమై రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పలుమార్లు రివ్యూ నిర్వహించారు. దీంతోపాటు కేసుల విషక్ష్ంలో కీలకంగా వ్యవహరిస్తున్న గవర్నమెంట్ ఫ్లీడర్లతో కూడా మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. దేవుడి భూములను ఆక్రమించినవారికి అసలు ఏ విధమైన శిక్షలు విధించాలి? ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలనే దానిపై దేవాదాయ శాఖ తీవ్రంగా మేధోమథనం చేస్తుంది. ఎండోమెంటు భూముల అన్యాక్రాంతానికి సంబంధించి కేసుల పురోగ‌తిని శాఖ అధికారులు మంత్రికి వివరించారు. ఈ మేరకు ఎండోమెంటు ప్రిన్స్ ప‌ల్ సెక్ర‌ట‌రీ శైల‌జ రామ‌య్య‌ర్‌, క‌మిష‌న‌ర్లు క్రిష్ణ ప్రసాద్, క్రిష్ణవేణి, ఎండోమెంటు శాఖ గవర్నమెంట్ ప్లీడర్(జీపీ) బీఎం నాయక్, ఏజీపీ శైలజ, విక్రమ్ తదితరులతో మంత్రి కొండా సురేఖ పూర్తి వివరాలు సేకరించారు. దేవుడి భూములు కాపాడ‌టంలో లీగ‌ల్ టీం పాత్ర చాలా కీల‌క‌మైందని దేవాదాయ శాఖ భావిస్తుంది.

23ఏండ్లుగా 1500కేసులు..

దేవాదాయ శాఖలో భూములకు సంబంధించి 2002 నుంచి 2025 వ‌ర‌కు 1,500 కేసులు పెండింగులో ఉన్నాయి. దీంతోపాటు ఈ కాల వ్య‌వ‌ధిలో 543 కోర్టు కేసుల‌ను డిస్పోజ్ చేసిన‌ట్టు దేవాదాయ శాఖకు నివేదిక అందింది. ఎండోమెంటు డిపార్టుమెంట్ కు సంబంధించిన కేసుల్లో రిట్ పిటిషన్ ప‌డిన ద‌గ్గ‌రి నుంచి కేసు పూర్త‌య్యేవ‌ర‌కు ఎలా ముందుకెళ్లాల్సి ఉంటుందనే ప్రక్రియపై ఎండోమెంటు శాఖ ఫోకస్ చేసింది. ఎండోమెంటు భూములు కాపాడ‌టంలో ప్లీడర్లదే కీల‌క పాత్ర ఉంటుందని శాఖ భావిస్తోంది.

ప్రత్యేక ట్రిబ్యునల్..

దేవుడి భూముల పరిరక్షణకు ఎండోమెంట్ ట్రిబ్యున‌ల్ అపాయింట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ట్ర‌స్టీల‌కు సంబంధించిన కేసుల్లో గ‌ట్టిగా వాదించాలని ఎండోమెంటు శాఖ భావిస్తున్నది. అవసరమైతే, ఆర్కియాల‌జీ డిపార్టుమెంట్ ద‌గ్గ‌ర వివ‌రాలు సేకరించాలని, ఆ సమాచారాన్ని సాక్ష్యంగా తీసుకుని వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం ఒక ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ నియ‌మించాల‌ని ఎండోమెంటు శాఖ నిర్ణయించింది. దైవ చింతన క‌ల్గిన వ్య‌క్తులు ఈ ప‌నిలో నిమగ్నమైతే మంచిద‌ని భావిస్తోంది. ఇంట్రిమ్ ఆర్డ‌ర్స్‌ పురోగతి విష‌యంలోనూ వివరాలు ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఇంట్రిమ్ ఆర్డ‌ర్స్ విష‌యంలో త‌మ డిపార్టుమెంట్ ను అల‌ర్ట్ చేయ‌క‌పోతే ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని ఉన్న‌తాధికారులు గుర్తించారు. వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ఎదుర్కొవ‌డానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల‌ని దేవాదాయ శాఖ భావిస్తోంది. ఎండోమెంటు కేసుల్లోని కంటెప్ట్ ఆఫ్ కోర్టు అంశాలు తీవ్రంగా ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయని గుర్తించారు. వీటి విష‌యంలో హైకోర్టుల‌కు పిలిచేదాకా పరిస్థితి వస్తున్నదని, ఇటువంటి పరిణామాలు జరగకుండా చూడాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఈ విష‌యంలో లీగల్ టీం, టీం పరిధిలోని వ్య‌వ‌స్థ స‌రైన టైంలో ఎండోమెంటు ఉన్న‌తాధికారుల‌ను అల‌ర్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, అందుకు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. దేవాదాయ శాఖ భూములు కాపాడేందుకు ప్ర‌భుత్వ అనుమ‌తితో ప్ర‌త్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల‌ని యోచిస్తున్నది. అయితే, అందుకు కావాల్సిన ఏర్పాట్లపై ఎండోమెంటు శాఖ చర్యలు చేపడుతున్నది. సివిల్ స‌ప్ల‌య్ డిపార్ట‌మెంటులో ఉన్న మాదిరిగా ఉండాల‌న్నారు. ఇక కౌంట‌ర్లు వేయ‌డంలో కూడా ఏమాత్రం నిర్ల‌క్ష్యం లేకుండా చేయాలని ఎండోమెంటు శాఖ ప్రయత్నిస్తున్నదని అధికారులు చెబుతున్నారు.

Next Story