కేసీఆర్, హరీష్‌రావులపై ప్రభుత్వ విప్ విజయరమణా రావు సంచలన ఆరోపణలు

by Malleboina Mahesh |

కాళేశ్వరం రీడిజైన్ పేరుతో కేసీఆర్ కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజీలు నొక్కింది.. శ్వేతపత్రం విడుదల చేయాలన్న ప్రభుత్వ విప్ విజయరమణా రావు!

కేసీఆర్, హరీష్‌రావులపై ప్రభుత్వ విప్ విజయరమణా రావు సంచలన ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పెద్ద ఇంజనీర్ కేసీఆర్ అయితే, చిన్న ఇంజ‌నీర్‌గా హ‌రీష్ రావు అవ‌తారం ఎత్తారని, ప్రపంచంలోనే 8వ వింత‌గా కాళేశ్వరం పేరు చెప్పి రైతుల‌ను మోసం చేశారని ప్రభుత్వి విప్, విజయరమణా రావు ఆరోపించారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానేరు గేట్లు ఎత్తితే ఆ నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్లు అని చెపుకున్నారు, హ‌రీష్ రావు రోజుకి 100 అబ‌ద్దాలు చెప్పక‌పోతే నిద్రప‌ట్టదని ఆయన విమర్శించారు. మోటార్లు ఎలా ఆన్ చేయాలో కూడా బీఆర్ఎస్ నాయ‌కుల‌కు తెలియ‌దని, మోటార్ల పెట్టే స‌మ‌యంలో కంపెనీల‌తో మాట్లాడుకుని ప‌ర్సంటేజీలు, మోబిలైజేష‌న్ అడ్వాన్స్ లు తీసుకోవ‌డ‌మే బీఆర్ఎస్ నాయ‌కుల‌కు తెలుసు అని విజయరమణా రావు ఆరోపించారు.

కాళేశ్వరం నుంచి ఏ నియోజ‌క‌వ‌ర్గానికి ఎన్ని నీళ్లు ఇచ్చారో శ్వేత్ర ప‌త్రం విడుద‌ల చేయాలని, కాళేశ్వరం కోసం కేసీఆర్ తెచ్చిన అప్పులో తమ ప్రభుత్వం రూ. 33,574 కోట్ల రూపాయ‌లతో పాటు రూ. 417 కోట్ల రూపాయ‌ల‌ను వ‌డ్డీగా చెల్లించామని ఆయన తెలిపారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ క‌నీసం ల‌క్ష ఎక‌రాలు కూడా కాళేశ్వరం నీళ్లతో సాగు కాలేదని, కాళేశ్వరం స‌ర్వరోగ నివారిణి, కోటీ ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు నీళ్లు ఇస్తామ‌ని చెప్పుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హ‌యాంలోని నాలుగేళ్లలో కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీళ్లు162 టీఎంసీలు మాత్రమే, ఇందులో 63 టీఎంసీల‌ను తిరిగి న‌దిలోకి వ‌దిలేశారని, నిక‌రంగా కాళేశ్వరం నుంచి ఎత్తిపోసింది కేవ‌లం 74 టీఎంసీలు మాత్రమే అని విజయరమణా రావు తెలిపారు. ఆ 74 టీఎంసీల నీళ్ల కోసం తొమ్మిది వేల కోట్ల విద్యుత్ ఛార్జీల కింద చెల్లించామని, తుమ్మిడిహ‌ట్టి ద‌గ్గర బ్యారేజీ క‌డితే ఇందులో సగం బిల్లు కూడా వ‌చ్చేది కాదని విజయరమణా రావు తెలిపారు.

కేసీఆర్ కుటుంబం అంతా ఇంజ‌నీర్లే అని, బీఆర్ఎస్ హ‌యాంలో క‌ట్టిన చెక్ డ్యాంలు అన్ని కొట్టుకుపోయాయి, కాంగ్రెస్ హ‌యాంలో క‌ట్టిన నాగార్జున సాగ‌ర్, శ్రీశైలం, జూరాల‌, ఎల్లంప‌ల్లి, మిడ్ మానేరు లాంటి ప్రాజెక్టులు ఇప్పటికి చెక్కు చెద‌ర‌లేదన్నారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని, మ‌హారాష్ట్రలో మంచి వ‌ర్షాలు ప‌డుతున్నాయి, నీళ్లు వ‌స్తాయన్నారు. తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద బ్యారేజీ నిర్మించి 16 ల‌క్షల న‌ల‌భై వేల ఎక‌రాల‌కు నీళ్లు ఇవ్వాల‌ని రూ.38 వేల కోట్లతో డీపీఆర్ త‌యారు చేశారని, రూ.5523 కోట్ల రూపాయ‌ల‌ను ఉమ్మడి రాష్ట్రంలోనే ఖ‌ర్చు చేశారని ఆయన తెలిపారు. కేసీఆర్ మ‌రో రూ.6 వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాడని, రూ.11 వేల ఆరువంద‌ల‌ కోట్ల ఖ‌ర్చు పెట్టిన త‌ర్వాత ప్రాణ‌హిత‌, చేవేళ్లను కేసీఆర్ ప‌క్కన పెట్టాడని విజయరమణా రావు ఆరోపించారు.

తుమ్మిడిహ‌ట్టిని తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని, గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చి ఎల్లంప‌ల్లిలో పోస్తాం, కాళేశ్వరంలో బ్యారేజీల ర‌క్షణే తమ ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. వ‌ర్షాలు పడొద్దు, పంట‌లు ప‌ండొద్దు, రైతులు పూర్తిగా నాశ‌నం కావాల‌న్నదే బీఆర్ఎస్ నేత‌ల ఆలోచ‌న‌ అని విజయరమణా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చారని, ఫ్యామిలీ ప్యాకేజీగా కాళేశ్వరాన్ని ఉప‌యోగించుకున్నారని ఆయన ఆరోపించారు. ఎల్లంప‌ల్లి నీళ్లను కూడా కాళేశ్వరం నీళ్లుగా చూపించారని విజయరమణా రావు ఆరోపించారు. ప్రతి నియోజ‌క‌వ‌ర్గం వెళ్లి కాళేశ్వరం నీళ్లు ముద్దాడాయని అని హ‌రీష రావు చెప్పుకున్నారని, గ‌జ్వేల్, సిద్దిపేట‌, సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గాల‌నే కాళేశ్వరం నీళ్లు ముద్దాడాయని ఆయన విమర్శలు గుప్పించారు.

Next Story