నిరుద్యోగులకు సర్కారు షాక్! ఇక ఆ స్కీం లేనట్లే?

by Disha Web Desk 4 |
నిరుద్యోగులకు సర్కారు షాక్! ఇక ఆ స్కీం లేనట్లే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగాలకు నోటిఫికేషన్‌తో పాటు నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తాం. త్వరలోనే అమలు చేస్తాం. ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

- 2021 జనవరి 28న మంత్రి కేటీఆర్

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ రాష్ట్రంలో మాత్రం ఉపాధి లేక నిరుద్యోగ యువత సంఖ్య పెరిగిపోతోంది. 30 ఏళ్లలో లోపు వారు రాష్ట్రంలో 30వేలకుపైగా ఉద్యోగం లేక సతమతమవుతున్నారు. ప్రభుత్వం వివరాలు సేకరిస్తే మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడం, అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో కేసీఆర్ ఈసారైనా కరుణిస్తారా? లేకుంటే మొండిచెయ్యి చూపుతారా? అనేది హాట్ టాఫిక్‌గా మారింది.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని టీఆర్‌ఎస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. 30 ఏళ్లలోపు నిరుద్యోగులకు నెలకు రూ.3016 చొప్పున భృతి అందిస్తామని పేర్కొంది. రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచింది. కానీ హామీని మాత్రం అమలు చేయలేదు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే ఉద్యోగం లేకపోయినా భృతి ఆసరాగా నిలుస్తుందని భావించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతోంది. అయితే మాటకు కట్టుబడి ఉంటామని పదేపదే చెబుతున్న కేసీఆర్... నిరుద్యోగ భృతి విషయంలో మాత్రం నోరుమెదపడం లేదని నిరుద్యోగులే మండిపడుతున్నారు. ఈ పథకాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేస్తుందా? అని మరోవైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ కీలక పథకాలకు నిధులు కేటాయించామని.. ప్రస్తుత పరిస్థితుల్లో నేల విడిచి సాము చేయలేమని గతేడాది బడ్జెట్ సమయంలో కేసీఆర్ పేర్కొన్నారు.

అయితే 2023-24 బడ్జెట్ కేసీఆర్ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ కావడంతో యువత ఆశలు పెట్టుకుంది. ఈసారి 3 లక్షల బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండడం, అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఈసారి నిరుద్యోగ భృతి అమలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ, పూర్తిస్థాయిలో ధీమాను మాత్రం వ్యక్తం చేయడం లేదు. ఈసారీ భృతిపై దాటవేత ధోరణిని ప్రభుత్వం అవలంబించే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గత పట్టభద్రుల ఎన్నికల సమయంలోనూ నిరుద్యోగభృతిని ప్రస్తావించారు. కానీ రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు? వారికి ఏ ప్రాతిపదికన భృతి కల్పించాలి? అర్హతలు ఎలా నిర్ణయించాలి తదితర అంశాలపై ప్రభుత్వానికే స్పష్టత లేదు. బడ్జెట్‌లో కేటాయింపులు చేపట్టలేదు. ప్రతి ఏటా లక్షలాది మంది పట్టభద్రులవుతున్నారు. వారికి ఆస్థాయిలో ఉద్యోగాలు లభించకపోవడంతో నిరుద్యోగుల సంఖ్యా ఏటా పెరుగుతోంది. ఈసారైనా బడ్జెట్‌లో కేటాయింపులు చేపడతారా? లేకుంటే శూన్యహస్తం చూపుతారా? అనేది చర్చనీయాంశమైంది.

Also Read...

ఎన్నికల వేళ.. మన ఊరు - మన బడిపై సర్కారు హడావిడి



Next Story