గుంపుల, అడవి సోమనపల్లి చెక్ డ్యాంలపై ప్రభుత్వం సీరియస్

by Ramesh Naini |

పెద్దపల్లి జిల్లాలో వరుసగా కూలిపోతున్న చెక్‌డ్యాంల ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గత నెల గుంపుల, మూడు రోజుల క్రితం అడవి సోమన్‌పల్లి చెక్ డ్యామ్‎లు కూలిపోయాయి.

గుంపుల, అడవి సోమనపల్లి చెక్ డ్యాంలపై ప్రభుత్వం సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్దపల్లి జిల్లాలో వరుసగా కూలిపోతున్న చెక్‌డ్యాంల ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. గత నెల గుంపుల, మూడు రోజుల క్రితం అడవి సోమన్‌పల్లి చెక్ డ్యామ్‎లు కూలిపోయాయి. గుంపుల, అడవి సోమనపల్లి చెక్ డ్యాంలు కూలిపోవడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలిపోయిన చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. వీటిని నాసిరకంగా, నాణ్యతలేమితో నిర్మించారా? లేదా ఎవరైనా కావాలనే ధ్వంసం చేశారా? అనే అంశాలపై విచారణ చేపట్టనున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నదని, విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా కావాలని రైతన్నలకు మేలు చేసే చెక్ డ్యాంలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

వరుసగా ఘటనలు..

పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్‌పల్లి దగ్గర మానేరుపై నిర్మించిన చెక్ డ్యాం ఇటీవల కొట్టుకుపోయింది. చెక్ డ్యాం వంద మీటర్ల వరకు తెగిపోయింది. అలాగే.. గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం సైతం కొట్టుకుపోయింది. గత ప్రభుత్వ హయాంలో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ డ్యాంలు కూలిపోవడంతో అధికారులు, స్థానికులు, రైతులు ఆందోళన చెందారు. అయితే.. ఈ చెక్ డ్యాం కూలిపోలేదని.. పేల్చివేశారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తున్నది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్‌పల్లి దగ్గర మానేరుపై గత ప్రభుత్వ హయాంలో రూ.39.82 కోట్లతో నిర్మించిన ఈ చెక్ డ్యామ్ కూలిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మానేరు డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందికు వదలడంతో అడవి సోమన్‌పల్లి చెక్ డ్యాంలో భారీగా నీరు చేరింది.

ఇటీవల చెక్ డ్యాం వంద మీటర్ల వరకు ఒక్కసారిగా కూలిపోయింది. అయితే.. కూలిన చెక్ డ్యామ్ ను పరిశీలించిన మంథని ఇరిగేషన్ శాఖ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గతేడాది 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకొని నిలిచిన చెక్ డ్యాం తక్కువ నీరు ఉన్న సమయంలో కూలిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంథని పోలీస స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం మానేరు వాగులోని చెక్ డ్యాం కూలి పోయింది. ఇక్కడ 2022 సంవత్సరంలో రూ.19 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. మానేరు వాగులో చెక్ డ్యాం నిర్మాణాలను చేపట్టారు. అయితే.. ఉన్నట్లుంది ఈ చెక్ డ్యాం సైతం కొట్టుకుపోయింది. దీనిని ఇసుక మాఫియా వారే పేల్చివేసి ఉంటారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story